Gold Rate: పసిడి మెరుపు తగ్గింది.. అంతర్జాతీయ ప్రభావంతో దిగొచ్చిన బంగారం ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల్లో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఇచ్చిన సంకేతాలు, దేశీయంగా కొనుగోలు డిమాండ్ మందగించడం వంటి అంశాలు ఈ విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,970కు చేరింది. అదే సమయంలో కిలో వెండి ధర రూ.2.25 లక్షలుగా నమోదైంది.
వివరాలు
సిల్వర్ ఫ్యూచర్స్ కిలో ధర..
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గుదల దిశగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 3,973.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్లో ఇది 4,100 డాలర్ల వరకు ఉండగా,ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గింది. మరోవైపు ఔన్సు వెండి ధర 57.42 డాలర్లకు పడిపోయింది. కమోడిటీ ఎక్స్ఛేంజీలో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.1.40 లక్షలు కాగా, సిల్వర్ ఫ్యూచర్స్ కిలో ధర రూ.2.21 లక్షల వద్ద ట్రేడవుతున్నాయి. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం,ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడం ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
వివరాలు
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే..
ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులను పలువురు మదుపర్లు తగ్గిస్తున్నారని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర ఆర్థిక సాధనాల వైపు మొగ్గు చూపుతారు. దీంతో పసిడిపై పెట్టుబడులు తగ్గి, ధరలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.