Sim Card Rules: 9 సిమ్లు దాటితే కొత్తది ఇవ్వొద్దు..టెలికాం సంస్థలకు డాట్ ఆదేశం.. ఆగస్టు 24 నుంచి అమలు
ఈ వార్తాకథనం ఏంటి
సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఒక వ్యక్తి పేరుపై ఇప్పటికే తొమ్మిది మొబైల్ సిమ్ కనెక్షన్లు ఉంటే.. ఇకపై అతడికి మరో కొత్త కనెక్షన్ ఇవ్వకూడదని టెలికాం శాఖ (డాట్) టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (టీఎస్పీలు) ఆదేశించింది. ఈ కొత్త నిబంధన 2026 ఆగస్టు 24 నుంచి అమల్లోకి రానుంది. నిర్ణీత పరిమితిని మించి కొత్త మొబైల్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసే ప్రతి సబ్స్క్రైబర్ను గుర్తించేందుకు అవసరమైన సాంకేతిక, సంస్థాగత వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని టెలికాం సంస్థలకు సూచించింది.
వివరాలు
డీఐపీతో తనిఖీలు
టెలికాం సంస్థలు అప్లోడ్ చేసే సబ్స్క్రైబర్ల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని టెలికాం శాఖ రూపొందించిన 'డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారమ్' (డీఐపీ)ను ఉపయోగించాలని డాట్ స్పష్టం చేసింది.
నిర్ణయించిన గరిష్ఠ పరిమితికి మించి ఇప్పటికే మొబైల్ కనెక్షన్లు తీసుకున్న సబ్స్క్రైబర్లకు సంబంధించిన వివరాలు డీఐపీలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
ఆగస్టు 23 నుంచి తమ పేరుపై గరిష్ఠ సంఖ్యలో మొబైల్ కనెక్షన్లు ఉన్న సబ్స్క్రైబర్లను గుర్తించేందుకు వారి ఫొటోలను కూడా డీఐపీలో అందుబాటులో ఉంచనున్నట్లు టెలికాం శాఖ పేర్కొంది.
దీంతో తొమ్మిది కనెక్షన్లు పూర్తయిన తర్వాత మరో సిమ్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తిని టెలికాం సంస్థలు సులభంగా గుర్తించగలుగుతాయి.
తద్వారా పరిమితికి మించి కొత్త సిమ్ జారీ కాకుండా అడ్డుకోవచ్చు.
వివరాలు
డీఐపీతో తనిఖీలు
డీఐపీతో టెలికాం సంస్థల అనుసంధాన ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించాలని కూడా టెలికాం శాఖ సూచించింది.
ఇందుకు సంబంధించిన ప్రక్రియను 2026 నవంబర్ 30లోగా పూర్తి చేయాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది.
ఈ చర్యల ద్వారా ఒకే వ్యక్తి పేరుతో అధిక సంఖ్యలో సిమ్లు తీసుకుని వాటిని సైబర్ నేరాలు, మోసాలకు ఉపయోగించే అవకాశాలను నియంత్రించడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది.