Mobile Tempered Glasses: విదేశీ టెంపర్డ్ గ్లాస్ కు బ్రేక్ వేయనున్న ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ల నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. టెంపర్డ్ గ్లాస్, స్క్రీన్ ప్రొటెక్టర్ల దిగుమతులపై నియంత్రణలు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఉత్పత్తులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) తప్పనిసరి రిజిస్ట్రేషన్ వ్యవస్థ (CRO) పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం కంపెనీలు, ఇతర వర్గాలతో చర్చలు జరిపినట్లు నివేదికలు వెల్లడించాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే నాణ్యత ధృవీకరణ లేని ఉత్పత్తులను భారత్లో తయారు చేయడం, విక్రయించడం లేదా దిగుమతి చేయడం కుదరదు. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న నాసిరకం ఉత్పత్తులకు అడ్డుకట్ట వేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
వివరాలు
ప్రతి ఏడాది వినియోగంలోకి 55 కోట్ల స్క్రీన్ ప్రొటెక్టర్లు
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త ప్రమాణాల ప్రకారం స్క్రీన్ ప్రొటెక్టర్ తయారీదారులు, దిగుమతిదారులు BIS నాణ్యత నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఉత్పత్తుల బలం, పారదర్శకత, మన్నిక, షాక్ను తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలపై పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్లో ప్రతి ఏడాది సుమారు 55 కోట్ల స్క్రీన్ ప్రొటెక్టర్లు వినియోగంలోకి వస్తున్నాయని, వాటిలో పెద్ద ఎత్తున విదేశీ ఉత్పత్తులే ఉన్నాయని అంచనా.
వివరాలు
కొత్త నియమాలతో నాణ్యత ప్రమాణాలు పాటించిన ఉత్పత్తులకే అనుమతి
BIS, CRO నిబంధనలు అమల్లోకి వస్తే దేశీయ కంపెనీలకు పెద్ద ఊతం లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు తక్కువ ధరల విదేశీ ఉత్పత్తులు మార్కెట్ను ఆక్రమించాయి. కొత్త నియమాలతో నాణ్యత ప్రమాణాలు పాటించిన ఉత్పత్తులకే అనుమతి లభించనుంది. దేశీయ తయారీని పెంచడం, దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా కేంద్రం ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. దీంతో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత కంపెనీలకు సమాన అవకాశాలు లభించడంతో పాటు పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
సరైన నాణ్యత పరీక్షలు లేకుండా మార్కెట్లో అనేక ఉత్పత్తులు
కొత్త నాణ్యత ప్రమాణాలతో వినియోగదారులకు మరింత భద్రత కలిగిన, ఎక్కువకాలం నిలిచే స్క్రీన్ ప్రొటెక్టర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో సరైన నాణ్యత పరీక్షలు లేకుండా అనేక ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. BIS సర్టిఫికేషన్ తప్పనిసరి అయితే కంపెనీలు నిర్ణయించిన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు భారతీయ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో స్క్రీన్ ప్రొటెక్టర్ తయారీ కేంద్రంగా భారత్ ఎదిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.