LOADING...
GST at 10: జీఎస్‌టీకి 9 ఏళ్లు పూర్తి.. సాంకేతికతతో మరింత సమర్థమైన పన్ను వ్యవస్థ
జీఎస్‌టీకి 9 ఏళ్లు పూర్తి.. సాంకేతికతతో మరింత సమర్థమైన పన్ను వ్యవస్థ

GST at 10: జీఎస్‌టీకి 9 ఏళ్లు పూర్తి.. సాంకేతికతతో మరింత సమర్థమైన పన్ను వ్యవస్థ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలై విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. దీంతో ఈ సంస్కరణ పదో సంవత్సరంలోకి ప్రవేశించింది. భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన పన్ను సంస్కరణల్లో జీఎస్‌టీ ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది.ప్రస్తుతం ప్రభుత్వం జీఎస్‌టీ వ్యవస్థను కేవలం అమలు పరిమితిలోనే కాకుండా,మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం కృత్రిమ మేధ (ఏఐ),డేటా షేరింగ్‌,ప్రక్రియల సరళీకరణ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తోంది. వీటి ద్వారా నిర్వహణ వ్యయాలను తగ్గించడం,రిఫండ్‌లను వేగంగా చెల్లించడం,పన్ను ఎగవేతలను నియంత్రించడం లక్ష్యంగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) జీఎస్‌టీ నిబంధనలను సులభంగా పాటించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకొస్తోంది.

వివరాలు 

పన్నుపై పన్ను విధించే విధానాన్ని తగ్గించడమే జీఎస్‌టీ ప్రధాన ఉద్దేశ్యం

అదేవిధంగా రిస్క్‌ అసెస్‌మెంట్‌ను మరింత సమర్థంగా నిర్వహించడం,పన్ను ఎగవేతలను అరికట్టడం,మానవ జోక్యాన్ని తగ్గించడం కోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జీఎస్‌టీ,ఆదాయపు పన్ను,కస్టమ్స్‌ డేటాబేస్‌లను పరస్పరం అనుసంధానిస్తోంది. జీఎస్‌టీ అమలుతో దేశంలో పన్ను పరిధి గణనీయంగా విస్తరించింది.పన్ను చెల్లింపుదారుల్లో నిబంధనల పాటింపు కూడా మెరుగుపడింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయాలు కూడా గణనీయంగా పెరిగాయి.జీఎస్‌టీకి ముందు అమల్లో ఉన్న 17 కేంద్ర,రాష్ట్ర పన్నులు,13 రకాల సెస్సులను రద్దు చేసి వాటి స్థానంలో ఏకీకృత పరోక్ష పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని వస్తువులు,సేవలపై ఒకే విధమైన పరోక్ష పన్ను విధానం అమలులో ఉంది. దేశమంతటా ఒకే మార్కెట్‌ను రూపొందించడం, పన్నుపై పన్ను విధించే విధానాన్ని తగ్గించడమే జీఎస్‌టీ ప్రధాన ఉద్దేశ్యం.

వివరాలు 

రేట్ల హేతుబద్ధీకరణ

జీఎస్‌టీ ప్రారంభమైన సమయంలో నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 66.5 లక్షలు మాత్రమే ఉండేది. ప్రస్తుతం 2026 నాటికి ఈ సంఖ్య దాదాపు 1.6 కోట్లకు చేరుకోవడం ఈ వ్యవస్థ విస్తరణకు నిదర్శనంగా నిలిచింది. జీఎస్‌టీ అమలులోకి వచ్చినప్పుడు నాలుగు పన్ను శ్లాబులు అమల్లో ఉండేవి. అప్పట్లో 5శాతం, 12 శాతం,18శాతం,28శాతం రేట్లను అమలు చేశారు. అనంతరం జీఎస్‌టీ వసూళ్లు స్థిరపడటం, నమోదిత పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడంతో పన్ను రేట్లను మరింత సరళీకరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2025 సెప్టెంబరు 22 నుంచి రెండు ప్రధాన శ్లాబులతో కూడిన జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చింది. ఇందులో నిత్యావసర వస్తువులపై 5 శాతం, సాధారణ వస్తువులు, సేవలపై 18 శాతం పన్ను విధిస్తున్నారు.

Advertisement

వివరాలు 

జీఎస్‌టీ రాబడుల్లో గణనీయమైన వృద్ధి

అలాగే విలాసవంతమైన, ఆరోగ్యానికి హానికరమైన వస్తువులపై ప్రత్యేకంగా 40 శాతం పన్ను శ్లాబును అమలు చేస్తున్నారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు కారణంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయి. దీంతో వినియోగదారులపై పన్ను భారం తగ్గి, పొదుపు అవకాశాలు కూడా పెరిగాయి. జీఎస్‌టీ అమలైన తొలి ఆర్థిక సంవత్సరం 2017-18లో సగటు నెలవారీ వసూళ్లు రూ.89,700 కోట్లుగా నమోదయ్యాయి. అనంతరం వసూళ్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ జీఎస్‌టీ ఆదాయం రూ.1.84 లక్షల కోట్లకు చేరుకోగా, 2025-26లో అది రూ.1.85 లక్షల కోట్లకు పెరిగింది.

Advertisement

వివరాలు 

జీఎస్‌టీ రాబడుల్లో గణనీయమైన వృద్ధి

ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 8.3 శాతం వృద్ధితో రూ.22.27 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతం వృద్ధితో రూ.22.08 లక్షల కోట్ల స్థూల జీఎస్‌టీ ఆదాయం నమోదైంది. ఈ గణాంకాలు దేశంలో జీఎస్‌టీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Advertisement