HCLTech CEO Salary: హెచ్సీఎల్ టెక్ సీఈఓకి రూ.175 కోట్ల భారీ పారితోషికం
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCLTech) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సి. విజయకుమార్కు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.175 కోట్ల (18.13 మిలియన్ డాలర్లు) పారితోషికం లభించింది. కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, ఇది గత ఆర్థిక సంవత్సరం (2024-25)తో పోలిస్తే 66.9 శాతం అధికం. ప్రస్తుతం అమెరికాలో విధులు నిర్వహిస్తున్న విజయకుమార్ తన వేతనాన్ని హెచ్సీఎల్ టెక్కు చెందిన అనుబంధ సంస్థ హెచ్సీఎల్ అమెరికా ఇంక్ ద్వారా అందుకుంటున్నారు. ఆయన పారితోషికం పెరగడానికి ప్రధాన కారణం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు (Long-Term Incentives - LTI), స్టాక్ ఆధారిత ప్రోత్సాహకాలు కావడం విశేషం.
వివరాలు
విజయకుమార్ పారితోషికంలో వాస్తవ పెరుగుదల 22.86 శాతం
2025-26లో ఆయనకు లభించిన మొత్తం 18.13 మిలియన్ డాలర్ల పారితోషికంలో 3.94 మిలియన్ డాలర్లు ఎల్టీఐ రూపంలో, 9.40 మిలియన్ డాలర్లు రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (RSUs) రూపంలో అందాయి.
అదనంగా 2.48 మిలియన్ డాలర్ల మూలవేతనం, 2 మిలియన్ డాలర్ల పనితీరు ఆధారిత బోనస్, 3.1 లక్షల డాలర్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
అయితే ఎల్టీఐ, ఆర్ఎస్యూల విలువను మినహాయిస్తే విజయకుమార్ పారితోషికంలో వాస్తవ పెరుగుదల 22.86 శాతానికి మాత్రమే పరిమితమవుతుందని కంపెనీ వెల్లడించింది.
వివరాలు
ప్రధాన కంపెనీల సీఈఓలతో పోలిస్తే విజయకుమార్ పారితోషికమే అత్యధికం
దేశీయ ఐటీ రంగంలోని ఇతర ప్రధాన కంపెనీల సీఈఓలతో పోలిస్తే విజయకుమార్ పారితోషికమే అత్యధికంగా నిలిచింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ సీఈఓ, ఎండీ కె. కృతివాసన్కు రూ.28 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్కు రూ.82.60 కోట్లు, విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు రూ.49.64 కోట్లు పారితోషికంగా లభించాయి.
మరోవైపు, హెచ్సీఎల్ టెక్లో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల మధ్యస్థ వార్షిక వేతనంతో పోలిస్తే విజయకుమార్ పారితోషికం 291.90 రెట్లు అధికంగా ఉందని కంపెనీ వార్షిక నివేదిక వెల్లడించింది.