Study : ఎన్ఆర్ఐలకంటే దేశీయ స్టార్టప్ వ్యవస్థాపకులే ముందంజ: అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్టప్ రంగంలో జరిగిన తాజా అధ్యయనం ఒక ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టింది. విదేశాల్లో పని చేసి తిరిగివచ్చిన ఎన్ఆర్ఐ టెక్ నిపుణుల కంటే, దేశంలోనే పెరిగిన స్థానిక వ్యవస్థాపకులు దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. సిలికాన్ వ్యాలీ విజయం మీద పరిశోధనలతో పేరుగాంచిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా,బర్క్లీ ప్రొఫెసర్ అన్నలీ సాక్సేనియన్, ప్రముఖ టెక్ వ్యవస్థాపకుడు, అకడమిక్ వివేక్ వాధ్వాతో కలిసి చేసిన ఈ పరిశోధనలో, 2016 నుంచి 2023 మధ్య ప్రారంభమైన 596 భారత హైటెక్ స్టార్టప్స్ను విశ్లేషించారు. స్టార్టప్ జీవనకాలం, ఉద్యోగుల సంఖ్య, విలువ, ఆదాయం వంటి అంశాల్లో స్థానిక వ్యవస్థాపకులే ముందున్నారని తేలింది.
వివరాలు
రిటర్నీ ప్యారడాక్స్
గతంలో విదేశీ అనుభవం ఉన్నవారే స్టార్టప్స్ను ముందుకు నడిపిస్తారన్న భావన ఉండేదని, కానీ ఇప్పుడు భారత మార్కెట్ అవసరాలను బాగా అర్థం చేసుకుని, టెక్నాలజీని వేగంగా అనుసరించగల దేశీయ వ్యవస్థాపకులే విజయబాటలో సాగుతున్నారని అధ్యయనం చెబుతోంది. విదేశాల నుంచి వచ్చినవారు ప్రారంభ దశలో పెట్టుబడులు సులభంగా సమీకరించగలిగినా, ఆ ఆధిక్యం కాలక్రమంలో తగ్గిపోతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని వారు "రిటర్నీ ప్యారడాక్స్"గా అభివర్ణించారు. భారత్, చైనా లాంటి దేశాలు ఇక అమెరికాపై ఆధారపడకుండా స్వయంగా ఆవిష్కరణలు చేయగల స్థాయికి చేరుకున్నాయని, దీని ప్రభావం భవిష్యత్తులో ప్రపంచ టెక్ ప్రతిభ ప్రవాహాలపై కూడా పడే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది.