Crude oil: చమురు సంక్షోభం దిశగా ప్రపంచం.. భారత్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది ?
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం క్రమంగా తీవ్రమవుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లో కలకలం రేగింది. ఈ ప్రభావం నేరుగా ముడి చమురు ధరలపై పడుతోంది. ముఖ్యంగా భారత్లాంటి భారీ చమురు దిగుమతిదార దేశాలకు ఇది ఆర్థికంగా గణనీయమైన ఒత్తిడిగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పెట్రోలియం ఎగుమతుల్లో సుమారు 20శాతం,ఎల్ఎన్జీ సరఫరాలో మరో 20శాతం వాటా ఉన్న హార్ముజ్ జలసంధి ఇప్పుడు కీలక కేంద్రమైంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురులో 50 శాతం,ఎల్ఎన్జీలో 54 శాతం ఈ మార్గం ద్వారానే వచ్చినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయ రవాణా వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది.
వివరాలు
ధరల పెరుగుదల భయం
ఈ పరిణామాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపనున్నాయన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. హార్ముజ్ మార్గంలో అంతరాయం ఏర్పడితే షిప్పింగ్, బీమా వ్యయాలు పెరగడం ఖాయం. దాంతో బ్రెంట్ క్రూడ్ ధరలు 5 నుంచి 15 శాతం వరకు ఎగబాకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బ్యారెల్ ధర 65 డాలర్ల నుంచి 73 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే విదేశీ మారక ద్రవ్యం వినియోగం భారీగా పెరుగుతుంది. ఫలితంగా కరెంట్ అకౌంట్ లోటు విస్తరించి, రూపాయి విలువ తగ్గే ప్రమాదం ఉంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
వివరాలు
చమురు కంపెనీలపై ఒత్తిడి
ఒకవేళ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటితే నిఫ్టీలో 3-5 శాతం వరకు అస్తిరత కనిపించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశమూ ఉన్నట్లు చెబుతున్నారు. ఐసీఆర్ఏ నివేదిక ప్రకారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థల లాభాలపై ప్రభావం పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా, దేశీయ రిటైల్ ధరలను పెంచకపోతే ఈ సంస్థల మార్కెటింగ్ మార్జిన్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పెయింట్స్, ఏవియేషన్, కెమికల్ రంగాలు కూడా పెరిగిన ముడి సరుకు ఖర్చులతో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముంది.
వివరాలు
ముడి సరుకు వ్యయాలు పెరగడం వల్ల లాభాలపై ప్రభావం
మార్కెట్ నిపుణుడు అభిషేక్ భట్ విశ్లేషణ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిస్థితి మిశ్రమంగా ఉండొచ్చని అంచనా. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు (GRM) బలంగా ఉంటే రిఫైనింగ్ విభాగానికి లాభం కలగవచ్చు. అయితే పెట్రోకెమికల్ విభాగంలో ముడి సరుకు వ్యయాలు పెరగడం వల్ల లాభాలపై ప్రభావం ఉండొచ్చని చెప్పారు. అదే సమయంలో రిలయన్స్ రిటైల్, జియో వంటి ఇతర వ్యాపారాలు చమురు విభాగంలో వచ్చే నష్టాలను కొంతవరకు సమతుల్యం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రిలయన్స్ షేరు రూ.1,394 వద్ద ట్రేడవుతోందని వివరించారు.
వివరాలు
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సవాళ్లు
యుద్ధ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సవాళ్లు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఐటీ, ఫార్మా వంటి తక్కువ ప్రమాద రంగాల వైపు మళ్లే అవకాశముందని అంచనా వేస్తున్నారు.