
HUL q2 results: ఒక్కో షేరుకు రూ.19 మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన హెచ్యూఎల్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL)తన రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.2,694 కోట్ల ఏకీకృత నికర లాభం సాధించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,595కోట్ల లాభంతో పోలిస్తే 3.8శాతం పెరుగుదలగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.16,034 కోట్లకు చేరింది,ఇది గత ఏడాది ఇదే సమయంలో ఉన్న రూ.15,703 కోట్లతో పోలిస్తే 2.1శాతం వృద్ధిగా నమోదైంది. కాగా,కంపెనీ మొత్తం ఖర్చులు 3.32 శాతం పెరిగి రూ.12,999 కోట్లకు చేరాయి అని రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఇతర ఆదాయాలను కలుపుకుని,కంపెనీ మొత్తం ఆదాయం రూ.16,388 కోట్లుగా ఉందని పేర్కొంది.
వివరాలు
నవంబర్ 20న చెల్లింపులు ప్రారంభం
తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ సంస్కరణలు వినియోగాన్ని ప్రోత్సహించాయని, వాటి తాత్కాలిక ప్రభావం ఈ త్రైమాసికంలో స్పష్టంగా కనిపించిందని హెచ్యూఎల్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియానాయర్ తెలిపారు. ఇక త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.19 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం నవంబర్ 7న రికార్డు డేట్గా నిర్ణయించగా, నవంబర్ 20న చెల్లింపులు ప్రారంభం అవుతాయని పేర్కొంది. ఈ డివిడెండ్ కింద మొత్తం రూ.4,464 కోట్లు 11 లక్షల మంది వాటాదారులకు చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల ప్రకటన అనంతరం, బీఎస్ఈలో హెచ్యూఎల్ షేర్లు 1.20 శాతం లాభంతో రూ.2,623 వద్ద ట్రేడయ్యాయి.