India's fertilizer subsidy: హోర్ముజ్ సంక్షోభం ప్రభావం.. ఎరువుల సబ్సిడీ 20% పెరిగే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
హోర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో భారత్లో ఎరువుల సబ్సిడీ భారం ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 20% పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఎరువుల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి కానీ రైతులకు అమ్మే గరిష్ట ధర (MRP)లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపారు. దీంతో అదనపు భారం ప్రభుత్వంపైనే పడనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ ఇప్పటికే ₹1.86 లక్షల కోట్లకు పెరిగినట్లు అంచనా వేయగా, ఈ ఏడాది బడ్జెట్లో ₹1.71 లక్షల కోట్లుగా కేటాయించారు.
వివరాలు
దేశంలో సుమారు 19 మిలియన్ టన్నుల ఎరువులు
ప్రపంచ ధరలు పెరిగినా రైతులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, యూరియా, DAP, పొటాష్ వంటి కీలక ఎరువుల ధరలను స్థిరంగా ఉంచుతున్నట్టు అధికారులు చెప్పారు. ఖరీఫ్ సీజన్ కోసం సరిపడా ఎరువుల నిల్వలు ఉండేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటూ అంతర్జాతీయ టెండర్లు కూడా ఆహ్వానించింది. ప్రస్తుతం దేశంలో సుమారు 19 మిలియన్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన మొత్తంలో దాదాపు సగం నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరతపై వచ్చిన వార్తలపై కేంద్రం స్పందిస్తూ దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు భయంతో ఒకేసారి ఎక్కువగా కొనడం వల్ల తాత్కాలిక సమస్యలు మాత్రమే ఏర్పడ్డాయని స్పష్టం చేసింది.