India joins Pax Silica : అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా'లో భారత్ ఎంట్రీ.. సెమీకండక్టర్ రంగానికి బిగ్ బూస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన 'పాక్స్ సిలికా' కూటమిలో భారత్ అధికారికంగా చేరింది. సెమీకండక్టర్ సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి,అలాగే అమెరికాతో ఆర్థిక-సాంకేతిక సహకారాన్ని మరింత పెంచేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్,ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw),అమెరికా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైఖేల్ క్రాట్సియోస్(Michael Kratsios),అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor) అలాగే అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. భారత్ 'పాక్స్ సిలికా' కూటమిలో అధికారికంగా చేరడంతో పాటు, రెండు దేశాల మధ్య కీలక ఖనిజాలు, భాగాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగాల్లో భాగస్వామ్యాన్ని అమలు చేయడానికి సంబంధించిన అదనపు ఒప్పంద పత్రంపై కూడా సంతకాలు జరిగాయి.
వివరాలు
'పాక్స్ సిలికా'తో భారత్-అమెరికా సంబంధాలకు బలం
ఇటీవలి కాలంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. 2025 డిసెంబర్లో ప్రారంభమైన 'పాక్స్ సిలికా' ప్రపంచవ్యాప్తంగా కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లు, ఏఐ మౌలిక వసతుల సరఫరా గొలుసును వినూత్నత ఆధారంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చింది.
వివరాలు
ముడి పదార్థాల నుంచి ఏఐ వరకూ సహకారం
2025 డిసెంబర్ 12న Washington, D.C.లో జరిగిన తొలి శిఖరాగ్ర సమావేశంలో భాగస్వామ్య దేశాలు ముడి పదార్థాల నుంచి అత్యాధునిక ఏఐ వ్యవస్థల వరకు మొత్తం విలువ గొలుసులో సమగ్ర సహకారం అందించేందుకు అంగీకరించాయి. భాగస్వామ్య దేశాల ఆర్థిక భద్రత, పరస్పర అభివృద్ధి కోసం నమ్మదగిన సరఫరా వ్యవస్థ అవసరమని ఈ ప్రకటన స్పష్టం చేసింది. దీర్ఘకాలిక సుసంపన్నతకు కృత్రిమ మేధస్సు కీలక శక్తిగా మారిందని, విశ్వసనీయ ఏఐ వ్యవస్థలు పరస్పర భద్రతకు, అభివృద్ధికి అత్యంత అవసరమని కూడా వెల్లడించింది.