Sugar Import Duty: చక్కెర ధరలకు బ్రేక్.. 100 శాతం దిగుమతి సుంకం తగ్గించే యోచనలో కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాలు తక్కువగా కురవడం,పండగల సీజన్లో చక్కెరకు డిమాండ్ పెరగడంతో దేశంలో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో చక్కెర దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 100శాతం సుంకాన్ని తగ్గించడమా.. లేక పూర్తిగా ఎత్తివేయడమా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేశీయ మార్కెట్లో సరఫరాను పెంచి ధరలను నియంత్రించడమే దీని ఉద్దేశం. ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే ఇటీవల దేశీయంగా చక్కెర ధరలు భారీగా పెరిగాయి. దిగుమతులపై ఉన్న 100శాతం పన్నును తగ్గించడం లేదా తొలగించడం ద్వారా విదేశాల నుంచి చక్కెరను తీసుకురావడానికి మార్గం సులభం చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నందున వివరాలను వెల్లడించలేమని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.
వివరాలు
ఆగస్టు చివరి నుంచి జనవరి వరకు చక్కెర వినియోగం ఎక్కువగా ఉంటుంది
ఆహార,వాణిజ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు దీనిపై వెంటనే స్పందించలేదు.
పండగల సీజన్ సమీపిస్తున్న సమయంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సాధారణంగా ఆగస్టు చివరి నుంచి జనవరి వరకు దేశంలో చక్కెర వినియోగం ఎక్కువగా ఉంటుంది.
పండగల సమయంలో సంప్రదాయ స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, పానీయాల తయారీలో చక్కెరకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో ధరలు మరింత పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
మరోవైపు ప్రపంచ చక్కెర మార్కెట్లోనూ సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఎల్నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్న భయాలు నెలకొన్నాయి.
దీంతో న్యూయార్క్ మార్కెట్లో చక్కెర ఫ్యూచర్స్ ధరలు దాదాపు ఏడాది కాలంలోనే అత్యధిక స్థాయికి చేరాయి.
వివరాలు
సాధారణం కంటే 13 శాతం తక్కువగా నైరుతి రుతుపవనాలు
భారత్లో చెరకు పంటకు కీలకమైన నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే 13 శాతం తక్కువగా నమోదైంది.
జూన్ చివరి నాటికి ఈ లోటు 40 శాతానికి పైగా ఉండేది. వర్షాకాలం ప్రారంభమైన మొదటి నెలలోనే వర్షాలు తక్కువగా పడటంతో కొన్ని పంటల సాగు ఆలస్యమైంది.
ఈ పరిస్థితి చెరకు దిగుబడిపైనా ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి.
మహారాష్ట్రలో చక్కెర మిల్లుల వద్ద ధరలు ఇటీవల కిలోకు సుమారు రూ.46కు చేరాయి.
ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధర అని ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) తెలిపింది.
వివరాలు
స్టాక్ పరిమితులను విధించిన ప్రభుత్వం
దేశంలో ప్రధాన చెరకు ఉత్పత్తి రాష్ట్రాలైన ఉత్తర్ప్రదేశ్,మహారాష్ట్రలోని చక్కెర కర్మాగారాలు సాధారణంగా నవంబర్ ప్రారంభంలో ప్రారంభించే చెరకు క్రషింగ్ను ఈసారి 10 నుంచి 15 రోజుల ముందుగానే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.
సరఫరాను పెంచేందుకు ఆహార మంత్రిత్వ శాఖతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అదే సమయంలో వ్యాపారులు పెద్ద మొత్తంలో చక్కెర నిల్వ చేసి ధరలను పెంచకుండా ప్రభుత్వం ఇటీవల స్టాక్ పరిమితులను విధించింది.
దీనివల్ల అక్రమ నిల్వలను అడ్డుకోవడంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
దేశీయ వినియోగం కోసం భారత్ సాధారణంగా పెద్ద మొత్తంలో చక్కెరను దిగుమతి చేసుకోదు.
ISMA గణాంకాల ప్రకారం చివరిసారిగా 2017-18లో భారత్ గణనీయమైన స్థాయిలో చక్కెరను దిగుమతి చేసుకుంది.
వివరాలు
ఆగస్టు 14 నాటికి దేశంలో 58.3 లక్షల హెక్టార్లలో చెరకు సాగు
వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఆగస్టు 14 నాటికి దేశంలో 58.3 లక్షల హెక్టార్లలో చెరకు సాగు చేశారు.
గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం స్వల్పంగా తక్కువగా ఉంది.
ఈ పరిస్థితుల్లో దేశీయ సరఫరాను పెంచి పండగ సీజన్లో ధరల పెరుగుదలను అడ్డుకునేందుకు దిగుమతి సుంకంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది.