Page Loader
USA: అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు విధించాలని భారత్‌ నిర్ణయం
అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు విధించాలని భారత్‌ నిర్ణయం

USA: అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు విధించాలని భారత్‌ నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌కి చెందిన వాణిజ్య ప్రతినిధులు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు ఒక కీలక సమాచారం ఇచ్చారు. అమెరికా నుండి దిగుమతయ్యే కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార చర్యలుగా సుంకాలు విధించనున్నట్లు వారు స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వం భారత స్టీల్‌ మరియు అల్యూమినియం ఎగుమతులపై విధించిన అధిక దిగుమతి సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ చర్యల భాగంగా, అమెరికా వస్తువులపై ఇస్తున్న కొన్ని ప్రత్యేక రాయితీలను భారత్‌ రద్దు చేయనుంది. అదే సమయంలో, వాటిపై దిగుమతి సుంకాలను పెంచేందుకు కూడా యోచిస్తోంది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని WTOకి తెలిపింది.

వివరాలు 

భారత స్టీల్‌ పరిశ్రమపై గణనీయంగా ప్రభావం 

అమెరికా విధించిన టారిఫ్‌ల ప్రభావం భారత ఎగుమతులపై తీవ్రంగా పడనుంది. అంచనాల ప్రకారం, 7.6 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఎగుమతులు దీని వల్ల నష్టాన్ని చవిచూస్తాయని అంచనా. ఈ నేపథ్యంలో, అమెరికా అనుసరిస్తున్న రక్షణాత్మక (ప్రొటెక్షనిస్ట్‌) విధానాలను భారత్‌ విమర్శించడంలో వెనుకడుగు వేయలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) భారీగా పెంచారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ స్టీల్‌ తయారీలో భారత్‌ రెండవ స్థానంలో నిలవగా, ట్రంప్ విధించిన ఈ సుంకాల ప్రభావం భారత స్టీల్‌ పరిశ్రమపై గణనీయంగా పడనున్నది.

వివరాలు 

అమెరికా-భారత వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ WTO వేదికగా ఈ అంశాన్ని తీవ్రమైన అంశంగా ప్రస్తావించింది. దీని వల్ల అమెరికా-భారత వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇక మరోవైపు, న్యూఢిల్లీ-వాషింగ్టన్‌ మధ్య ఒక సరికొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో, ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించేందుకు, భారత్‌ ఆ ఒప్పందం ద్వారా అనేక రాయితీలను ఇవ్వడానికి సిద్ధమైందని ప్రచారం జరిగింది.