LOADING...
Gold imports: బంగారానికి కస్టమ్స్‌ షాక్‌.. 70 శాతం తగ్గిన దిగుమతులు
బంగారానికి కస్టమ్స్‌ షాక్‌.. 70 శాతం తగ్గిన దిగుమతులు

Gold imports: బంగారానికి కస్టమ్స్‌ షాక్‌.. 70 శాతం తగ్గిన దిగుమతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి. పసిడిపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ సుంకాన్ని దాదాపు రెండున్నర రెట్లు పెంచిన తర్వాత బంగారం దిగుమతులు సుమారు 70 శాతం మేర క్షీణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత నెల రోజుల వ్యవధిలో కేవలం 25 నుంచి 30 టన్నుల బంగారం మాత్రమే దేశంలోకి దిగుమతి అయినట్లు సమాచారం. ఇంతకుముందు నెలకు 75 నుంచి 100 టన్నుల వరకు బంగారం దిగుమతి అయ్యేదని అధికారులు తెలిపారు. అయితే మే 13న కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండిపై ఉన్న 6శాతం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడంతో దిగుమతులపై వెంటనే ప్రభావం పడింది. అధిక సుంకాల కారణంగా వ్యాపారులు, దిగుమతిదారులు కొనుగోళ్లను తగ్గించడంతో పసిడి దిగుమతులు ఒక్కసారిగా క్షీణించాయి.

వివరాలు 

మే నెలలో 3.41 బిలియన్‌ డాలర్లకు పెరిగిన బంగారం దిగుమతుల బిల్లు

అయితే పరిమాణం తగ్గినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడంతో దిగుమతుల విలువ మాత్రం పెరిగింది. మే నెలలో బంగారం దిగుమతుల బిల్లు గత ఏడాదితో పోలిస్తే 34 శాతం పెరిగి 3.41 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రపంచ మార్కెట్లో పసిడి ధరల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌, మే నెలల మధ్య బంగారం దిగుమతుల విలువ 60.14 శాతం పెరిగి 9.04 బిలియన్‌ డాలర్లకు చేరింది. దేశ విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని తగ్గించేందుకు, దిగుమతుల బిల్లును నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

వివరాలు 

చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశంగా భారత్

విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాలంటే బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం బంగారం,వెండిపై దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా కొనుగోళ్లను నిరుత్సాహపరిచే చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయాల ప్రభావం ప్రస్తుతం బంగారం దిగుమతుల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశంగా భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

వివరాలు 

దిగుమతులపై మరింత ప్రభావం

2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం 721.03 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, వాటి విలువ 71.98 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. బంగారానికి దేశీయంగా డిమాండ్‌ కొనసాగుతున్నప్పటికీ, పెరిగిన కస్టమ్స్‌ సుంకాలు, అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా రానున్న రోజుల్లో దిగుమతులపై మరింత ప్రభావం ఉండే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement