India's Smartphone Market: స్మార్ట్ఫోన్ మార్కెట్కు షాక్.. జూన్ త్రైమాసికంలో 10% తగ్గిన షిప్మెంట్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో స్మార్ట్ ఫోన్ మార్కెట్కు ఆరేళ్లలోనే అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మార్కెట్ పరిశోధనా సంస్థ కౌంటర్పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10 శాతం తగ్గాయి. 2020 తర్వాత జూన్ త్రైమాసికంలో నమోదైన అతిపెద్ద క్షీణత ఇదేనని సంస్థ వెల్లడించింది. స్మార్ట్ఫోన్ ధరలు వరుసగా పెరగడం,మెమరీ చిప్లు సహా ఇతర కీలక విడిభాగాల ధరలు రికార్డు స్థాయికి చేరడం,ద్రవ్యోల్బణ ప్రభావం, వినియోగదారుల ఐచ్ఛిక ఖర్చులు తగ్గడం వంటి కారణాలతో మార్కెట్ మందగించినట్లు నివేదిక తెలిపింది. దీంతో వినియోగదారులు కొత్త ఫోన్ కొనుగోలు చేయడాన్ని వాయిదా వేస్తుండటంతో ఫోన్ మార్చే వ్యవధి కూడా పెరిగినట్లు పేర్కొంది.
వివరాలు
15శాతం పెరిగిన స్మార్ట్ఫోన్ ధరలు
త్రైమాసికం మొత్తం మీద మెమరీ,ఇతర భాగాల ధరలు పెరుగుతుండటంతో కంపెనీలు పలుమార్లు స్మార్ట్ఫోన్ ధరలను సవరించాయి.
ఫలితంగా జూన్ త్రైమాసికం ముగిసే నాటికి సగటు స్మార్ట్ఫోన్ ధరలు దాదాపు 15శాతం పెరిగినట్లు కౌంటర్పాయింట్ తెలిపింది.
ప్రత్యేకంగా రూ.15 వేలలోపు ధర కలిగిన స్మార్ట్ఫోన్ విభాగం తీవ్ర ప్రభావానికి గురైంది.
ఈ విభాగంలో షిప్మెంట్లు ఏకంగా 45శాతం తగ్గాయి. ఎంట్రీ లెవల్,మధ్యస్థ ధరల విభాగాలపై ఎక్కువగా ఆధారపడిన చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ల మార్కెట్ వాటా కూడా 2020 తర్వాత రెండోసారి కనిష్ఠ స్థాయికి చేరినట్లు నివేదిక పేర్కొంది.
వివరాలు
నిలకడగా కొనసాగిన అల్ట్రా ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగం
దీర్ఘకాలంలో 5జీ స్మార్ట్ఫోన్ మార్కెట్కు ప్రధాన వృద్ధి కారకంగా కొనసాగినా.. విడిభాగాల ధరలు సాధారణ స్థాయికి వచ్చే వరకు ధరను ప్రాధాన్యంగా చూసే వినియోగదారులకు 4జీ ఫోన్లు ఇంకా కీలక పాత్ర పోషిస్తాయని కౌంటర్పాయింట్ అభిప్రాయపడింది.
మరోవైపు రూ.45 వేలకుపైగా ధర కలిగిన అల్ట్రా ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగం మాత్రం నిలకడగా కొనసాగింది. ఖరీదైన ఫోన్లను ఈఎంఐ వంటి ఫైనాన్స్ పథకాల ద్వారా కొనుగోలు చేసే వారి సంఖ్య పెరగడంతో ఈ విభాగంపై ప్రభావం తక్కువగా కనిపించిందని సంస్థ తెలిపింది.
వివరాలు
2026 మొత్తం సంవత్సరానికి భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ 13 శాతం వరకు తగ్గే అవకాశం
కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. మెమరీ, ఇతర విడిభాగాల ధరలు ఇంకా అధికంగానే ఉండటంతో ఈ ఏడాది మిగిలిన కాలంలో కూడా స్మార్ట్ఫోన్ మార్కెట్పై ఒత్తిడి కొనసాగుతుందని తెలిపారు.
2025 సెప్టెంబర్తో పోలిస్తే స్మార్ట్ఫోన్ మెమరీ ధరలు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని,రాబోయే నెలల్లో అవి ఐదు రెట్ల వరకు చేరే అవకాశం ఉందన్నారు.
దీంతో 2026 మొత్తం సంవత్సరానికి భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ 13 శాతం వరకు తగ్గే అవకాశముందని అంచనా వేశారు.
బ్రాండ్ల వారీగా చూస్తే.. ఐక్యూ (iQOO)ను మినహాయించి వివో 18 శాతం మార్కెట్ వాటాతో దేశంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
ప్రీమియం వి70 సిరీస్కు లభించిన మంచి డిమాండ్ ఇందుకు ప్రధాన కారణమని నివేదిక తెలిపింది.
వివరాలు
14శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానంలో ఒప్పో
శాంసంగ్ రెండో స్థానాన్ని కొనసాగించడమే కాకుండా.. టాప్-5 కంపెనీల్లో వార్షిక ప్రాతిపదికన షిప్మెంట్లు పెంచుకున్న ఏకైక సంస్థగా నిలిచింది.
గెలాక్సీ ఏ సిరీస్, ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లకు లభించిన ఆదరణతో సంస్థ షిప్మెంట్లు 2 శాతం పెరిగాయి.
ఒప్పో 14శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానంలో నిలవగా.. షియోమీ (పోకోతో కలిపి) 13 శాతం వాటాతో నాలుగో స్థానంలో నిలిచింది.
రియల్మీ టాప్-5లో చివరి స్థానంలో నిలిచింది. రూ.20 వేలలోపు ధరల విభాగంలో వరుస ధరల పెంపులు డిమాండ్ను తగ్గించడంతో షియోమీ, రియల్మీ షిప్మెంట్లు తగ్గినట్లు కౌంటర్పాయింట్ తెలిపింది.
ఆపిల్ ఐఫోన్ షిప్మెంట్లు వార్షిక ప్రాతిపదికన 3 శాతం తగ్గగా.. సంస్థ మార్కెట్ వాటా 7 శాతంగా నమోదైంది.
వివరాలు
అత్యంత వేగంగా వృద్ధి చెందిన స్మార్ట్ఫోన్ బ్రాండ్గా నథింగ్
ఐఫోన్ 17 సిరీస్కు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. సరఫరా పరిమితులు, స్టాక్ కొరత కారణంగా షిప్మెంట్లు ఆశించిన స్థాయిలో జరగలేదని నివేదిక పేర్కొంది.
ఈ త్రైమాసికంలో నథింగ్ భారత్లో అత్యంత వేగంగా వృద్ధి చెందిన స్మార్ట్ఫోన్ బ్రాండ్గా నిలిచింది.
సంస్థ షిప్మెంట్లు గత ఏడాదితో పోలిస్తే 105శాతంపెరిగాయి. ఫోన్ (4ఎ)సిరీస్కు లభించిన ఆదరణతో పాటు,ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించడం వల్ల బ్రాండ్కు మరింత గుర్తింపు లభించిందని కౌంటర్పాయింట్ తెలిపింది.
అల్ట్రా ప్రీమియం విభాగంలో గూగుల్ పిక్సెల్ 68శాతం వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన బ్రాండ్గా నిలిచింది.
దూకుడైన మార్కెటింగ్,ఆఫ్లైన్ విక్రయాల విస్తరణ,ధరలను పెంచకుండా కొనసాగించడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలని నివేదిక వెల్లడించింది.