India-US interim trade deal: తుది దశలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. త్వరగా పూర్తి చేయాలని మోదీ-ట్రంప్ ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా మధ్య కుదరనున్న మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (ఇంటరిమ్ ట్రేడ్ డీల్) తుది దశకు చేరుకుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని, ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులకు సూచించినట్లు తెలిపారు.
వివరాలు
బీటీఏకు సంబంధించిన అంశాలపై కూడా కీలక చర్చలు
వచ్చే వారం అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ భారత్కు రానున్నారు. ఈ పర్యటనలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రితో సమావేశమై మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి తుది రూపు ఇవ్వడంపై చర్చలు జరపనున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య చాలా కాలంగా చర్చల్లో ఉన్న సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)కు సంబంధించిన అంశాలపై కూడా కీలక చర్చలు సాగనున్నాయి. జీ7 సదస్సు సందర్భంగా మోదీ, ట్రంప్ సమావేశంలో ఈ వాణిజ్య ఒప్పందం ప్రధాన అజెండాగా నిలిచింది. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా చాలా దగ్గరలో ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యంతో పాటు పలు రంగాల్లో సహకారం పెరుగుతోందని ఆయన చెప్పారు.
వివరాలు
జూన్ 22న భారత్'కు అమెరికా వాణిజ్య ప్రతినిధి
అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్నారని ట్రంప్ ప్రశంసించారు. భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, దీనిని తమ దేశం స్వాగతిస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జూన్ 22న అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత్ చేరుకోనున్నట్లు కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. జూన్ 23, 24 తేదీల్లో జరిగే సమావేశాల్లో మధ్యంతర వాణిజ్య ఒప్పందం రూపురేఖలకు తుది మెరుగులు దిద్దడంతో పాటు, విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కూడా చర్చలు జరగనున్నాయని చెప్పారు.
వివరాలు
వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా వాణిజ్య ఒప్పందం
అమెరికా ప్రతిపాదించిన టారిఫ్ విధానాలు, సెక్షన్ 301 దర్యాప్తులకు సంబంధించిన అంశాలపై కూడా ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. అయితే ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం భారత్-అమెరికా మధ్య ఉన్న మొత్తం వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా రూపొందిస్తున్నట్లు రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు. ఒప్పందం కుదిరిన తర్వాత ఈ వివాదాస్పద అంశాలపైనా స్పష్టత వచ్చే అవకాశముందని తెలిపారు.
వివరాలు
ఇండియా-అమెరికా కాంపాక్ట్
వాణిజ్య రంగంతో పాటు రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, ఇంధన రంగం, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై కూడా మోదీ, ట్రంప్ సమీక్ష నిర్వహించారు. 2025 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఇండియా-అమెరికా కాంపాక్ట్ (COMPACT) కార్యక్రమం కింద సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసి, అన్ని రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.