Indian Rupee : డాలర్ దాటికి రూపాయి విలవిల.. రికార్డు పతనం..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ మరోసారి భారీగా పడిపోయింది. మంగళవారం రూపాయి విలువ చరిత్రలో తొలిసారి 95.58 స్థాయికి చేరింది. అంతకుముందు రోజు 95.31 వద్ద ముగిసిన రూపాయి.. తాజాగా మరింత బలహీనపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడం వల్ల రూపాయిపై ఒత్తిడి పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారత్ తన అవసరాల్లో 85 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుండటంతో.. క్రూడ్ ధరల పెరుగుదల నేరుగా రూపాయి విలువపై ప్రభావం చూపుతోంది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ ఉండటం, విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం కూడా రూపాయి పతనానికి కారణమయ్యాయి.
వివరాలు
విదేశీ మారకద్రవ్య మార్కెట్లో పలుమార్లు జోక్యం చేసుకున్న ఆర్ బి ఐ
ఇక అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు గల్ఫ్ ప్రాంతంలో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ "అత్యంత సంక్షోభ పరిస్థితిలో ఉంది" అని వ్యాఖ్యానించడం మార్కెట్లలో ఆందోళన పెంచింది. దీంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో మరోసారి అస్థిరత నెలకొంది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విదేశీ మారకద్రవ్య మార్కెట్లో పలుమార్లు జోక్యం చేసుకున్నట్లు ట్రేడర్లు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్ల విక్రయాలు కూడా జరిగాయని సమాచారం. ఇటీవల డాలర్ డిమాండ్ను తగ్గించే చర్యలు, ఫారెక్స్ మార్కెట్పై కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తూ RBI పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేస్తోంది.
వివరాలు
భారత స్టాక్ మార్కెట్లపైనా రూపాయి బలహీనత ప్రభావం
రూపాయి బలహీనత ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైనా కనిపించింది. చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. రూపాయి మరింత పడిపోతే పెట్రోల్, డీజిల్, రవాణా ఖర్చులు, ఆహార ధరలు, దిగుమతి వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.