Stock Market: లాభాలతో మొదలై నష్టాల్లోకి జారిన దేశీయ స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆరంభంలో కనిపించిన లాభాలు ఎక్కువసేపు నిలవలేదు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా ఒత్తిడిలో ట్రేడవుతున్నాయి. సోమవారం నష్టాలతో ముగిసిన సూచీలు మంగళవారం ప్రారంభంలో స్వల్ప లాభాలు నమోదు చేసినప్పటికీ, కొద్దిసేపటికే తిరిగి నష్టాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ రెండూ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.96.33 వద్ద నమోదైంది. సోమవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న బ్యాంకింగ్ రంగ షేర్లు మాత్రం మంగళవారం కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
నిఫ్టీ @ 24,220
గత ట్రేడింగ్ సెషన్లో 77,708 వద్ద ముగిసిన సెన్సెక్స్ మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమైంది.
ఆ తర్వాత స్వల్పంగా లాభాల్లోకి వెళ్లినా ఆ ఉత్సాహం నిలవక మళ్లీ నష్టాల్లోకి జారింది.
ఉదయం 9:45 గంటల సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్లు కోల్పోయి 77,604 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు నిఫ్టీ కూడా అదే ధోరణిని కొనసాగిస్తూ 18 పాయింట్ల నష్టంతో 24,220 వద్ద కదలాడుతోంది.
వ్యక్తిగత షేర్ల విషయానికి వస్తే ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మణప్పురం ఫైనాన్స్, ఎన్హెచ్పీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, నవుమా వెల్త్ వంటి షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
మరోవైపు డిక్సన్ టెక్నాలజీస్, సుప్రీమ్ ఇండస్ట్రీస్, కల్యాణ్ జువెల్లర్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
బ్యాంకింగ్ విభాగంలో కొనుగోళ్ల ఆసక్తి
ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నప్పటికీ, రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ విభాగంలో కొనుగోళ్ల ఆసక్తి కనిపిస్తోంది.
బ్యాంక్ నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 135 పాయింట్లు ఎగిసి ట్రేడవుతోంది. దీంతో మార్కెట్లో మొత్తం మీద మిశ్రమ ధోరణి కొనసాగుతోంది.