Stock Market: లాభాల స్వీకరణతో నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావంతో వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో లాభాల బాటలో సాగిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం నష్టాల వైపు మళ్లాయి. సూచీలు గరిష్ట స్థాయిల వద్ద ఉండటంతో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ మార్కెట్లు నెగటివ్ ట్రెండ్లోకి వెళ్లాయి. ముఖ్యంగా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో భారీగా అమ్మకాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్ ధరలు తగ్గడంతో మెటల్ రంగం దాదాపు రెండు శాతం వరకు నష్టపోయింది. ఇదే సమయంలో విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతూ సెన్సెక్స్, నిఫ్టీని నష్టాల్లోకి నెట్టాయి. గత సెషన్ ముగింపు 83,817తో పోలిస్తే గురువారం ఉదయం సెన్సెక్స్ దాదాపు ఫ్లాట్గా ప్రారంభమైంది.
వివరాలు
సెన్సెక్స్ 331 పాయింట్ల నష్టం
అయితే కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీ నష్టాల బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పడిపోయింది. అనంతరం కొంత మేర కోలుకున్నప్పటికీ పూర్తిగా లాభాల్లోకి రాలేదు. ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 331 పాయింట్ల నష్టంతో 83,486 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో నిఫ్టీ కూడా సెన్సెక్స్ను అనుసరిస్తూ 118 పాయింట్లు కోల్పోయి 25,651 స్థాయిలో కొనసాగుతోంది.
వివరాలు
నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 387 పాయింట్ల నష్టం
సెన్సెక్స్ సూచీలో బజాజ్ హోల్డింగ్స్, నైకా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, జుబిలెంట్ ఫుడ్స్, యూనియన్ బ్యాంక్ వంటి షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. మరోవైపు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హిందుస్థాన్ జింక్, వేదాంత, కేన్స్ టెక్నాలజీస్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 387 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 90 పాయింట్ల నష్టంలో ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.41 వద్ద ట్రేడవుతోంది.