Stock Market: కనిష్ఠాల నుంచి పుంజుకున్న సెన్సెక్స్.. ఇన్వెస్టర్లకు ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం యూటర్న్ తీసుకున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత గణనీయంగా పుంజుకుని లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు మార్కెట్కు ఊపిరి పోశాయి. ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయిల నుంచి సెన్సెక్స్ దాదాపు 1,378 పాయింట్లు కోలుకోవడం విశేషం. ఈ ర్యాలీతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.5 లక్షల కోట్లు పెరిగి రూ.427 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 73,477.53 పాయింట్ల వద్ద ప్రారంభమై, క్రితం ముగింపు (73,319.55) కంటే తక్కువగా ట్రేడైంది.
వివరాలు
రూపాయి మారకం విలువ 93.05గా నమోదు
ఒక దశలో 72,728.66 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అయితే కాల్పుల విరమణకు సంబంధించిన సానుకూల వార్తలతో మార్కెట్ వేగంగా కోలుకుని 74,207.46 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 787.30 పాయింట్ల లాభంతో 74,106.85 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ కూడా 255.15 పాయింట్లు పెరిగి 22,968.25 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.05 వద్ద నమోదైంది. సెన్సెక్స్ 30 షేర్లలో ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సన్ఫార్మా షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 108 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సుకు 4,689 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
మార్కెట్ రికవరీకి కారణాలు ఇవీ:
ఇరాన్-అమెరికా శాంతి చర్చలు: పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి రూపురేఖలు సిద్ధమయ్యాయన్న వార్తలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి. హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్యం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు మార్కెట్కు అనుకూలంగా మారాయి. తగ్గిన ముడిచమురు ధరలు: శాంతి చర్చల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 110 డాలర్ల కంటే దిగువకు రావడం భారత ఆర్థిక వ్యవస్థకు, ద్రవ్యోల్బణ నియంత్రణకు సహకరిస్తుంది.
వివరాలు
మార్కెట్ రికవరీకి కారణాలు ఇవీ:
బలపడిన రూపాయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలతో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 93.04 స్థాయికి చేరింది. కరెన్సీ మార్కెట్లో స్థిరత్వం పెరగడం స్టాక్ మార్కెట్ రికవరీకి దోహదపడింది. ఆసియా మార్కెట్ల ప్రభావం: జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి వంటి ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ కావడం కూడా భారత మార్కెట్కు మద్దతు ఇచ్చింది.