Reuters Survey: స్థిరంగా భారత్ వృద్ధి.. యూఎస్-ఇరాన్ యుద్ధంతో అసంఘటిత రంగానికి భారీ దెబ్బ: రాయిటర్స్ సర్వే
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, యూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అసంఘటిత రంగంపై తీవ్రంగా పడుతోందని రాయిటర్స్ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి 27 మధ్య 54 మంది ఆర్థిక నిపుణులతో ఈ సర్వే జరిపారు. ఉద్యోగాలు, డిమాండ్, చిన్న వ్యాపారాలపై ప్రత్యక్ష ప్రభావంపై రియల్టైమ్ డేటా లేకపోవడం వల్ల అసలు ప్రభావాన్ని అంచనా వేయడం కష్టంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. గతంలో జిడిపీలో దాదాపు సగం వాటా కలిగిన అసంఘటిత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఒత్తిడిలో పడింది. పట్టణాల్లో సుమారు 60% జిడిపీ ఉత్పత్తి అవుతుండగా, ఎల్పీజీ సిలిండర్ల కొరతతో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడం లేదా కార్యకలాపాలు తగ్గించడం జరిగింది.
వివరాలు
అసంఘటిత రంగం షాకులను తట్టుకునే సామర్థ్యం చాలా తక్కువ
కొందరు ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త జిడిపీ సిరీస్ ద్వారా అసంఘటిత రంగంపై స్పష్టత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నా, ఇంకా పూర్తిస్థాయి సమాచారం రావడానికి సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఉపాసన భరద్వాజ్ (Kotak Mahindra Bank) ప్రకారం అసంఘటిత రంగం షాకులను తట్టుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉండడంతో ఉద్యోగాలు, డిమాండ్పై ప్రభావం పడే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో పశ్చిమ ఆసియా ఘర్షణ ప్రజల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుందని అంచనా. ప్రభుత్వం ధరల ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పెట్టుబడులు (క్యాపెక్స్) నుంచి సబ్సిడీలకు నిధులు మళ్లించే పరిస్థితి రావచ్చని ఆదిత్య వ్యాస్ హెచ్చరించారు.
వివరాలు
ఆర్బీఐ 2027 చివరి వరకు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం
సర్వే ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జిడిపీ వృద్ధి 6.7%గా ఉండొచ్చని అంచనా, ఇది గత అంచనాతో పోలిస్తే కొంచెం తక్కువ. 2027-28లో ఇది 6.8%కి చేరవచ్చు. ద్రవ్యోల్బణం సగటున 4.5%గా ఉండే అవకాశం ఉంది, ఇది రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా లక్ష్య పరిధిలోనే ఉన్నప్పటికీ, గత ఏడాదికంటే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో కూడా ఆర్బీఐ 2027 చివరి వరకు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.