IndiGo: ఇండిగో ఛార్జీల పెంపు.. దేశీయ విమాన ప్రయాణికులపై అదనపు భారం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ విమాన ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో షాక్ ఇచ్చింది. శిశువుల ప్రయాణం, అదనపు లగేజీ, ప్రయారిటీ సేవలు, ప్రయాణ ధ్రువపత్రం వంటి పలు సర్వీసులకు సంబంధించిన ఛార్జీలను పెంచింది. బేసిక్ టికెట్ ధరలో ఎలాంటి మార్పు లేకపోయినా.. అదనపు సేవలు వినియోగించే ప్రయాణికుల మొత్తం ప్రయాణ వ్యయం పెరగనుంది. పెద్దలతో కలిసి ప్రయాణించే శిశువుల (3 రోజుల నుంచి 2 ఏళ్లలోపు) రుసుమును ఇండిగో రూ.2,000 నుంచి రూ.3,000కి పెంచింది. విమానయాన నిబంధనల ప్రకారం శిశువులకు ప్రత్యేక సీటు కేటాయించరు. పెద్దలు తమ ఒడిలో కూర్చోబెట్టుకుని వారిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ రుసుమును టికెట్ బుకింగ్ సమయంలోనే చెల్లించాలి.
వివరాలు
అదనపు లగేజీపై కిలోకు రూ.800
అనుమతించిన పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులపై కూడా అదనపు భారం పడనుంది. అదనపు లగేజీ ఛార్జీని ప్రతి కిలోకు రూ.700 నుంచి రూ.800కు పెంచింది.
దీంతో పరిమితికి మించి తీసుకెళ్లే ప్రతి కిలో లగేజీపై రూ.100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
పెద్దల తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించే చిన్నారుల కోసం అందించే 'అన్అకంపనీడ్ మైనర్' సర్వీస్ ఛార్జీని రూ.5,000 నుంచి రూ.5,999కి పెంచారు.
త్వరగా చెక్ఇన్, బోర్డింగ్ పూర్తి చేసుకునేందుకు అందించే ప్రయారిటీ సేవల రుసుమును రూ.450 నుంచి రూ.650కి పెంచారు.
వివరాలు
ఇతర సేవల ఛార్జీలూ పెంపు
అలాగే, ప్రయాణ ధ్రువపత్రం (ట్రావెల్ సర్టిఫికెట్) ఫీజును రూ.200 నుంచి రూ.300కు పెంచుతున్నట్లు ఇండిగో వెల్లడించింది.
ఈ సవరించిన ఛార్జీలన్నీ దేశీయ విమాన సర్వీసులకు వర్తిస్తాయి.
బేసిక్ టికెట్ ధర మారకపోయినా.. ఆయా అదనపు సేవలను ఎంచుకునే ప్రయాణికులపై ఈ పెంపు ప్రభావం చూపనుంది.