IndiGo: FDTL గడువుకు ముందే ఇండిగో సన్నద్ధం.. విమానాల రద్దులు తక్కువే: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 10న ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను పూర్తిగా అమలు చేయాల్సిన గడువు దగ్గరపడడంతో ఇండిగో తన పైలట్ల సంఖ్యను పెంచి, ఆపరేషనల్ బఫర్లను బలోపేతం చేసిందని ఓ మీడియా రిపోర్ట్ తెలిపింది. దీంతో విమాన సర్వీసులకు పెద్దగా అంతరాయం ఉండదని కేంద్ర ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్లో సిబ్బంది బఫర్ సున్నాగా ఉండగా, ఫిబ్రవరిలో దాన్ని 3 శాతానికి పెంచిన ఇండిగో, స్టాండ్బై పైలట్ల సంఖ్యను కూడా పెంచింది. పైలట్ల విశ్రాంతి నిబంధనలపై ఇచ్చిన తాత్కాలిక మినహాయింపులు ముగిసిన తర్వాత ఆపరేషన్లు సజావుగా సాగేందుకు ఇవి తీసుకున్న చర్యలని 'హిందుస్తాన్ టైమ్స్' పేర్కొంది.
వివరాలు
సరైన దిశలోనే ఇండిగో
డిసెంబర్ 2025లో సవరించిన FDTL నిబంధనలను పాటించడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఇండిగో 5 వేలకుపైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో భారీ గందరగోళం ఏర్పడింది. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)రూ.22.2కోట్ల రికార్డు జరిమానా విధించి,సంస్థ సీనియర్ మేనేజ్మెంట్పై బాధ్యత చర్యలు ప్రారంభించింది. ఆ తర్వాత డిసెంబర్ 6, 2025న ఫిబ్రవరి 10, 2026 వరకు రాత్రి డ్యూటీ పరిమితుల్లో సడలింపులతో తాత్కాలిక మినహాయింపులు ఇచ్చింది. తాజా సమీక్షల్లో ఇండిగో సరైన దిశలోనే ఉందని, FDTL ఉల్లంఘనల వల్ల పెద్దగా విమాన రద్దులు ఉండబోవని అధికారులు తెలిపారు. ఒక్కో విమానానికి అవసరమైన పైలట్ క్రూ సెట్ల సంఖ్యను పెంచడం ద్వారా సంస్థ ఆపరేషనల్ బలం పెరిగిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వివరాలు
284 విమానాలు మాత్రమే రద్దు
ఫిబ్రవరి రోస్టర్లో ఒక్కో విమానానికి సగటున 7.2 క్రూ సెట్లు ఉండగా, జనవరిలో ఇది 7.1 మాత్రమేనని వెల్లడైంది. జనవరిలో జరిగిన విమాన రద్దుల్లో ఎక్కువ భాగం వాతావరణ ప్రతికూల పరిస్థితులు, గగనతల పరిమితుల కారణంగానే జరిగాయని, పైలట్ డ్యూటీ నిబంధనల వల్ల కాదని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ సమీక్ష స్పష్టం చేసింది. జనవరి 15 నుంచి 31 మధ్య ఇండిగో తన షెడ్యూల్ చేసిన సర్వీసుల్లో సుమారు 90 శాతం నడిపించగా, 284 విమానాలను మాత్రమే రద్దు చేసిందని అధికారులు తెలిపారు. ఇటీవలి వారాల్లో పైలట్ డ్యూటీ నిబంధనల వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలిగే స్థాయిలో విమానాలు రద్దైనట్టు ఎలాంటి సూచనలు లేవని కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.