Infosys: ఇన్ఫోసిస్ లాభాల్లో 4.7 శాతం వృద్ధి.. ఒక్కో షేరుపై ₹21 డివిడెండ్
ప్రఖ్యాత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.6,506 కోట్ల నికర లాభాన్ని సాధించింది, ఇది గత ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.6,212 కోట్లతో పోలిస్తే 4.7 శాతం వృద్ధిని సూచిస్తుంది. అలాగే, ఈ సమయంలో కంపెనీ ఆదాయం 4.2 శాతం పెరిగి రూ.40,986 కోట్లకు చేరిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ సందర్భంగా భవిష్యత్తు ఆదాయ వృద్ధి అంచనాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 3.7-4.5 శాతంగా ఉండవచ్చని సంస్థ తెలిపింది. ఈ క్రితం త్రైమాసికంలో ఈ అంచనాలను 3-4 శాతం గా పేర్కొంది.
రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు
అంతేకాక, మధ్యంతర డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది. అర్హులైన షేర్హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.21 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. దీని రికార్డు తేదీ అక్టోబర్ 29గా నిర్దారించింది. నవంబర్ 9 నాటికి డివిడెండ్ను అందించనున్నట్లు తెలిపారు. రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు నమోదు చేయడం పట్ల కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ త్రైమాసికంలో 2.4 బిలియన్ డాలర్ల డీల్స్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ఎన్ఎస్ఈలో 2.84 శాతం పెరిగి రూ.1974 వద్ద ముగిసింది.