
H-1B visa fee: ట్రంప్ నిర్ణయం ప్రభావం.. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోతో సహా కుదేలైన ఐటీ షేర్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేసిన కొత్త ఆదేశం కారణంగా భారతీయ ఐటీ రంగం షేర్లు సోమవారం (సెప్టెంబర్ 22) గణనీయంగా నష్టపోయాయి. ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా ఫీజును ఏడాదికి 1,000 డాలర్ల నుండి నేరుగా 100,000డాలర్లకు పెంచింది. ఈ భారీ పెంపు వలసలపై ఆంక్షలు కఠినతరం చేయడమే లక్ష్యమని చెబుతున్నారు. నిఫ్టీ ఐటీ సూచీ సోమవారం రోజున ఇంట్రాడే ట్రేడింగ్లో 3.5 శాతం క్షీణించింది, అదే సమయంలో బెంచ్మార్క్ నిఫ్టీ కేవలం 0.5 శాతం తగ్గింది. నిఫ్టీ ఐటీకి చెందిన అన్ని కంపెనీల షేర్లు ఎరుపులోనే ముగిశాయి. టెక్ మహీంద్రా షేర్ ధర 5.8% పడిపోగా, ఎంఫాసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు 5% కంటే ఎక్కువ నష్టపోయాయి.
వివరాలు
H-1B వీసా పెంపు ప్రభావం
టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, కోఫోర్జ్, ఎల్టిఐ మైండ్ట్రీ షేర్లు 3-5% వరకు తగ్గాయి. ఆరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రం 1.4% నష్టాన్ని మాత్రమే చవిచూసింది. ట్రంప్ సంతకం చేసిన తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, కొత్త H-1B వీసా అప్లికేషన్ ఫీజు 100 రెట్లు పెరిగింది. ఇది FY26 వీసా అప్లికేషన్లపై ప్రభావం చూపకపోయినా, FY27 నుండి దీనికి పూర్తి స్థాయి ప్రభావం ఉంటుందని MOSL నివేదికలో తెలిపింది. గత దశాబ్దంలోనే భారతీయ ఐటీ సంస్థలు H-1B వీసాలపై ఆధారాన్ని తగ్గించుకున్నాయి. అమెరికాలో స్థానిక నియామకాల పెంపు కారణంగా ప్రస్తుతం సగటున మొత్తం ఉద్యోగుల్లో కేవలం 20% మంది మాత్రమే ఆన్సైట్ ఉన్నారు.
వివరాలు
కంపెనీల వ్యూహం, ఆర్థిక ప్రభావం
వారిలో కూడా 20-30% మంది H-1B వీసా కలిగినవారే. అంటే మొత్తం శ్రామిక శక్తిలో కేవలం 3-5% వరకు మాత్రమే కొత్త ఫీజు ప్రభావం చూపుతుంది. అమెరికా పెద్ద టెక్ సంస్థలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా.. కొత్త H-1B అప్లికేషన్లలో భారతీయ ఐటీ సంస్థల కంటే ఎక్కువ వాటా కలిగినవిగా MOSL పేర్కొంది. స్థానిక నియామకాల మోడల్, సబ్కాంట్రాక్టింగ్ మద్దతుతో భారతీయ ఐటీ సంస్థలు ఈ మార్పుకు సరిపోయే స్థితిలో ఉన్నాయని చెప్పింది. MOSL అంచనా ప్రకారం, భారతీయ ఐటీ సంస్థలు కొత్త H-1B అప్లికేషన్లను తగ్గించి, ఆఫ్షోర్ డెలివరీ, స్థానిక నియామకాలపై దృష్టి పెడతాయి.
వివరాలు
స్థానిక నియామకాల పెంపు వల్ల 15-50 బేసిస్ పాయింట్ల వరకు మార్జిన్ ప్రభావం
దీని వల్ల ఆన్సైట్ రెవెన్యూ తగ్గినా, ఆఫ్షోర్ ప్రాజెక్టులు ఎక్కువ లాభదాయకం కావడంతో ఆపరేటింగ్ మార్జిన్లు మెరుగుపడే అవకాశం ఉంది. ఇక JM ఫైనాన్షియల్ ప్రకారం, స్థానిక నియామకాల పెంపు వల్ల 15-50 బేసిస్ పాయింట్ల వరకు మార్జిన్ ప్రభావం ఉండొచ్చు. అయితే ఆఫ్షోరింగ్ పెరిగితే ఆ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని తెలిపింది. మొత్తం మీద, ఆర్థికంగా ఇది తటస్థ ప్రభావమే అని అభిప్రాయపడింది. MOSL విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం ఐటీ రంగం విలువలు తగిన స్థాయిలో ఉన్నా, కొత్త టెక్నాలజీ సైకిల్, లాభాల వృద్ధిపై ఆధారపడి రంగం రేటింగ్ మెరుగవుతుందని అంచనా వేసింది.
వివరాలు
ఏ ఐటీ స్టాక్స్ కొనాలి?
పెద్ద కంపెనీల్లో హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా స్టాక్స్నే ప్రాధాన్యతనిచ్చింది. కొత్త మేనేజ్మెంట్ కింద టెక్ మహీంద్రా మార్పులు, BFSI రంగంలో మెరుగైన ఫలితాలు వీటికి తోడ్పడుతున్నాయని తెలిపింది. హెచ్సిఎల్ టెక్కి వైవిధ్యమైన, స్థిరమైన పోర్ట్ఫోలియో బలం. మధ్య తరహా కంపెనీల్లో కోఫోర్జ్, హెక్సావేర్ స్టాక్స్ను సిఫార్సు చేసింది.