Stock market: వరుసగా మూడో రోజు జోష్లో మార్కెట్.. సెన్సెక్స్ 544 పాయింట్ల జంప్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో పెట్టుబడిదారుల్లో సానుకూల భావన పెరిగి కొనుగోళ్ల జోరు కనిపించింది. అంతేకాకుండా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఆందోళనలు కొంత మేర తగ్గడం కూడా మార్కెట్కు ఊతమిచ్చాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాలకు చెందిన షేర్లు మంచి ప్రదర్శన కనబరిచాయి. అయితే మెటల్ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ 24,000 మార్కుకు అత్యంత సమీపంలో ముగియడం విశేషం. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 76,526.77 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. గత సెషన్లో ఇది 76,264.33 పాయింట్ల వద్ద ముగిసింది.
వివరాలు
లాభాల్లో బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్
రోజంతా లాభాల్లోనే ట్రేడైన సూచీ ఒక దశలో 76,846.74 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 544.15 పాయింట్లు లాభపడి 76,808.48 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 135.25 పాయింట్లు పెరిగి 23,989.15 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 94.55గా నమోదైంది. సెన్సెక్స్లోని 30 షేర్లలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్ షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేశాయి. మరోవైపు ఇండిగో, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, బీఈఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 81 డాలర్లకు తగ్గింది. బంగారం ధర ఔన్సుకు 4,343 డాలర్ల వద్ద కొనసాగుతోంది.