Mehli Mistry: ఆర్ఎన్టీ అసోసియేట్స్ డైరెక్టర్ పదవికి మెహ్లీ మిస్త్రీ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మెహ్లీ మిస్త్రీ మరో కీలక పదవికి రాజీనామా చేశారు. రతన్ టాటా కుటుంబ కార్యాలయంగా గుర్తింపు పొందిన ఆర్ఎన్టీ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్ పదవికి ఆయన వైదొలిగారు. 2023 మార్చిలో బోర్డులో చేరిన ఆయన, మూడేళ్లు పూర్తి కాకముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30 తేదీతో బోర్డుకు రాసిన లేఖలో, ఇతర బాధ్యతలు పెరగడంతో డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మెహ్లీ మిస్త్రీ తెలిపారు. ఈ రాజీనామా జూలై 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
వివరాలు
ప్రస్తుతం టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా మెహ్లీ మిస్త్రీ
గతంలో టాటా ట్రస్టుల నుంచి కూడా మెహ్లీ మిస్త్రీ తప్పుకోవాల్సి వచ్చింది. 2025 నవంబర్లో టాటా ట్రస్టుల బోర్డు నుంచి ఆయనను తొలగించారు. దీంతో టాటా గ్రూప్కు చెందిన సంస్థలు, అనుబంధ సంస్థలతో ఆయన సంబంధాలు క్రమంగా ముగుస్తున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మెహ్లీ మిస్త్రీ టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు ఆర్ఎన్టీ అసోసియేట్స్ బోర్డులో రతన్ టాటా సోదరీమణులు షిరీన్ జెజీభాయ్, డీనా జెజీభాయ్తో పాటు టాటా సన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జంశీద్ పొంచా, టాటా సన్స్ జనరల్ కౌన్సెల్ సిద్ధార్థ్ శర్మ సభ్యులుగా ఉన్నారు.
వివరాలు
స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్ఎన్టీ అసోసియేట్స్ ఏర్పాటు
2009 మార్చిలో స్థాపించబడిన ఆర్ఎన్టీ అసోసియేట్స్ను రతన్ టాటా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పేటీయం, ఓలా, బ్లూస్టోన్ వంటి దాదాపు రెండు డజన్ల స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టింది. డివిడెండ్లు, కన్సల్టెన్సీ సేవల ద్వారా సంస్థకు ఆదాయం లభిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన రూ.36 కోట్ల ఆదాయంలో దాదాపు సగం డివిడెండ్ల రూపంలో వచ్చినట్లు అందుబాటులో ఉన్న ఆర్థిక నివేదికలు వెల్లడించాయి. రతన్ టాటా, ఆయన విశ్వసనీయ సహచరుడు ఆర్.కే. కృష్ణకుమార్ గతంలో ఆర్ఎన్టీ అసోసియేట్స్ ప్రధాన వాటాదారులుగా ఉండేవారు. అనంతరం 2022లో రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (RTEF), రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ (RTET)లను సంస్థ ప్రధాన వాటాదారులుగా ఏర్పాటు చేశారు.
వివరాలు
నోయెల్ టాటాతో పాటు ఇతర ట్రస్టీలు తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు
ఆర్టీఈఎఫ్ బోర్డులో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, రాఘవన్ శాస్త్రి, బుర్జిస్ తారాపోరేవాలా సభ్యులుగా ఉన్నారు. ఆర్టీఈటీ ట్రస్టీలుగా టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, షిరీన్ జెజీభాయ్, డీనా జెజీభాయ్, ప్రమిత్ ఝవేరి, రాఘవన్ శాస్త్రి, జంశీద్ పొంచా కొనసాగుతున్నారు. టాటా ట్రస్టుల నుంచి తనను తొలగించిన నిర్ణయాన్ని మెహ్లీ మిస్త్రీ మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ ఎదుట సవాలు చేశారు. నోయెల్ టాటాతో పాటు ఇతర ట్రస్టీలు తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే తనకు మళ్లీ టాటా ట్రస్టుల్లో పదవి కావాలనే ఉద్దేశం లేదని, ట్రస్టుల్లో జరిగినట్లు తాను భావిస్తున్న తప్పులను వెలుగులోకి తీసుకురావడానికే ఈ న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.