
Natco Pharma: నాట్కో ఫార్మా చరిత్రలోనే అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు.. వార్షిక ఈపీఎస్ రూ.105.26
ఈ వార్తాకథనం ఏంటి
నాట్కో ఫార్మా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గణనీయమైన ఫలితాలను సాధించింది.
కంపెనీ స్థాపితమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ నమోదు చేయని విధంగా అత్యధిక వార్షిక ఆదాయంతో పాటు,అత్యుత్తమ నికర లాభాన్ని కూడా పొందింది.
కంపెనీ విడుదల చేసిన ఏకీకృత ఆర్థిక నివేదికల ప్రకారం,మొత్తం ఆదాయం రూ.4,784 కోట్లు కాగా, నికర లాభం రూ. 1,883.4 కోట్ల నికరలాభాన్ని, రూ.105.26 ఈపీఎస్ను నమోదు చేసింది.
గత ఆర్థిక సంవత్సరం 2023-24తో పోలిస్తే ఈసారి మొత్తం ఆదాయం 16 శాతం, నికర లాభం 36 శాతం పెరిగినట్లు కంపెనీ పేర్కొంది.
దీన్ని సాధించడానికి పటిష్ఠమైన వ్యూహాత్మక ప్రణాళికలు, సంవత్సరాలుగా కొనసాగిస్తున్న కార్యాచరణ విధానమే కారణమని నాట్కో ఫార్మా స్పష్టం చేసింది.
వివరాలు
మార్చి త్రైమాసిక ఫలితాలు కూడా మెరుగ్గానే..
2025 మార్చితో ముగిసిన త్రైమాసికానికి నాట్కో ఫార్మా రూ. 1,287.3 కోట్ల మొత్తం ఆదాయాన్ని నమోదు చేసింది.
ఇదే కాలంలో నికర లాభం రూ. 406 కోట్లు,ఈపీఎస్ రూ. 22.70గా ఉంది.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 1,110.3 కోట్లు, నికర లాభం రూ. 386.3 కోట్లు, ఈపీఎస్ రూ. 21.56గా నమోదయ్యాయి.
అంటే అన్ని రంగాల్లోనూ మెరుగుదల కనిపించిందన్నమాట. ఈ త్రైమాసికంలో పరిశోధన,అభివృద్ధి విభాగంపై ఖర్చులు ఎక్కువయ్యాయి.
అయినప్పటికీ కంపెనీ లాభాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అంతేకాక,క్రాప్ హెల్త్ సైన్స్ వ్యాపారంలో 'ఇంపెయిర్మెంట్ ఛార్జీ' కింద రూ. 50 కోట్లు,అమెరికాలోని అనుబంధ సంస్థకు'ఛార్జ్బ్యాక్ అడ్జస్ట్మెంట్' కింద రూ. 25 కోట్లు కేటాయించబడినప్పటికీ త్రైమాసిక లాభం మెరుగ్గానే నమోదైంది.