Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గవు.. హర్దీప్ సింగ్ పూరి
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధర బ్యారెల్కు సుమారు 70 డాలర్లకు పడిపోయినప్పటికీ, దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రస్తుతం విక్రయిస్తున్న ఇంధనం రెండు నెలల క్రితం అధిక ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురుతో శుద్ధి చేసినదేనని ఆయన వివరించారు. అందువల్ల ధరలు తగ్గాలంటే కనీసం మరో రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశముందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఇదే స్థాయిలో మరో రెండు నుంచి మూడు నెలల పాటు కొనసాగితేనే దేశీయంగా పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపుపై చర్చించే అవకాశం ఉంటుందని పూరి పేర్కొన్నారు.
వివరాలు
ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల వినియోగదారులపై భారం తగ్గింది
అయితే ఇది ప్రస్తుతం ఊహాత్మక పరిస్థితి మాత్రమేనని, దీనిపై మరింతగా వ్యాఖ్యానించబోనని స్పష్టం చేశారు. ఇంధన ధరల పెంపుపై విమర్శలకు స్పందించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల వినియోగదారులపై భారం గణనీయంగా తగ్గిందన్నారు. ఢిల్లీలో 2022 జూన్ నుంచి 2026 జూన్ వరకు పెట్రోల్ ధర కేవలం 5.6 శాతం,డీజిల్ ధర 6.2 శాతం మాత్రమే పెరిగిందని తెలిపారు. ఇదే కాలంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు, పొరుగు దేశాల్లో ఇంధన ధరలు మరింత ఎక్కువగా పెరిగాయని గుర్తు చేశారు. వినియోగదారులను రక్షించినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు భారీ ఆర్థిక భారం భరించాల్సి వచ్చిందని పూరి వెల్లడించారు.
వివరాలు
హర్ముజ్ సంక్షోభాన్ని భారత్ ఎలాంటి ఇంధన కొరత లేకుండా విజయవంతంగా ఎదుర్కొంది
2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై కలిపి సుమారు రూ.1.88 లక్షల కోట్ల మేర అండర్ రికవరీ నమోదైందన్నారు. అయితే వాస్తవ నష్టం సుమారు రూ.74,781 కోట్లుగా ఉందని చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో వ్యయానికి తక్కువ ధరలకు ఇంధనం విక్రయించడం వల్ల వచ్చిన నష్టాలను సంస్థలు ఇంకా భర్తీ చేసుకుంటున్నాయని వివరించారు. 110 రోజుల పాటు కొనసాగిన హర్ముజ్ సంక్షోభాన్ని భారత్ ఎలాంటి ఇంధన కొరత లేకుండా విజయవంతంగా ఎదుర్కొందని పూరి తెలిపారు. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.07 లక్షల పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధనం పూర్తిగా అయిపోలేదని చెప్పారు.
వివరాలు
దేశ ఇంధన నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచడంపై ప్రభుత్వం దృష్టి
కొరతపై వచ్చిన వార్తల్లో ఎక్కువ భాగం తప్పుడు ప్రచారం, భయంతో జరిగిన అధిక కొనుగోళ్ల వల్లేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశ ఇంధన నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆయన వెల్లడించారు. భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వలతో పాటు రిఫైనరీలు, పోర్టులు, టెర్మినల్స్, సముద్రంలో ఉన్న చమురు సరుకులను కలిపి చూస్తే భారత్కు ప్రస్తుతం కనీసం 76 నుంచి 80 రోజుల అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.