Oil Giants: యుద్ధ ప్రభావం.. ప్రతి సెకనుకు 3 వేల డాలర్లు సంపాదిస్తున్న చమురు కంపెనీలు..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ యుద్ధం ప్రభావంతో అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. పెట్రోలు బంకుల వద్ద సాధారణ ప్రజలు గంటల తరబడి ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ప్రజలకు సమయం, డబ్బు నష్టం జరుగుతుండగా, మరోవైపు ప్రపంచంలో అగ్రగామి చమురు సంస్థలు మాత్రం ఈ సంవత్సరం అపార లాభాలను సంపాదిస్తున్నాయి. సమాచారం ప్రకారం, ఈ సంస్థలు ఒక్క సెకనుకు సుమారు 2,967 డాలర్ల వరకు లాభం పొందుతున్నాయి. మన రూపాయల్లో ఇది దాదాపు రూ.2.83 లక్షలుగా ఉంటుంది అని ఆక్స్ఫామ్ అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో కొలంబియాలోని శాంటా మార్టా నగరంలో జరుగుతున్న సదస్సు సందర్భంగా ఈ అధ్యయనం విడుదలైంది.
వివరాలు
ఇంధన ఖర్చులతో తీవ్రంగా నలుగుతున్న అమెరికా సహా పలు దేశాలు
ప్రపంచంలోని అతిపెద్ద చమురు సంస్థలు అయిన చెవ్రాన్, షెల్, బీపీ, కొనొకొఫిలిప్స్, ఎక్సాన్మొబిల్, టోటల్ ఎనర్జీస్ సంస్థల కలిపి లాభాలు ఈ ఏడాది 94 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముందని అంచనా వేయబడింది. గత సంవత్సరం తో పోలిస్తే రోజువారీ లాభాలు సుమారు 37 మిలియన్ డాలర్ల మేర పెరగనున్నట్లు నివేదిక తెలిపింది. ఇలా చమురు సంస్థలు భారీగా లాభాలు పొందుతుండగా, అమెరికా సహా పలు దేశాల్లో ప్రజలు మాత్రం ఇంధన ఖర్చులతో తీవ్రంగా నలుగుతున్నారు.
వివరాలు
హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత,ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరాన్,అమెరికా మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ,ఆదేశ ఓడరేవుల నుంచి బయలుదేరే నౌకలను అడ్డుకునేందుకు అమెరికా బలగాలు చర్యలు చేపట్టాయి. ఈపరిస్థితుల కారణంగా చమురు ధరలు ఒక్క బ్యారెల్కు 100 డాలర్లను దాటాయి. ధరలు పెరుగుతున్న కొద్దీ చమురు సంస్థల లాభాలు మరింతగా పెరుగుతున్నాయి.ఈ ఆరు సంస్థలు ఈఏడాది పొందనున్న లాభాలతో ఆఫ్రికా ఖండంలో సుమారు ఐదుకోట్ల మందికి సౌర విద్యుత్ను అందించవచ్చని ఆక్స్ఫామ్ పేర్కొంది. ఇదే సమయంలో,ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు పలు దేశాలు ఇంటి నుంచే పని చేయడం, ఇంధన సరఫరాపై నియంత్రణలు విధించడం వంటి చర్యలను అమలు చేస్తున్నాయి.