LOADING...
Parle-G: స్టాక్ మార్కెట్లోకి పార్లే ప్రొడక్ట్స్.. రూ.9,530 కోట్ల ఐపీఓ లక్ష్యం
స్టాక్ మార్కెట్లోకి పార్లే ప్రొడక్ట్స్.. రూ.9,530 కోట్ల ఐపీఓ లక్ష్యం

Parle-G: స్టాక్ మార్కెట్లోకి పార్లే ప్రొడక్ట్స్.. రూ.9,530 కోట్ల ఐపీఓ లక్ష్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయులందరికీ ఎంతో సుపరిచితమైన పార్లే-జీ బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ లిమిటెడ్ త్వరలో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది భారీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను తీసుకురావడానికి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9,530 కోట్లు) సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఓ సమయంలో సంస్థ విలువను 10.5 బిలియన్ డాలర్లు (రూ.1 లక్ష కోట్లకు పైగా)గా అంచనా వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

వివరాలు 

1929లో ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో ప్రారంభమైన సంస్థ

దాదాపు శతాబ్ద కాలంగా ప్రైవేట్ సంస్థగా కొనసాగుతున్న పార్లే ప్రొడక్ట్స్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతుండటం భారత కార్పొరేట్ రంగంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఐపీఓ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కంపెనీ ఇప్పటికే కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్ సంస్థలను సలహాదారులుగా నియమించినట్లు సమాచారం. అవసరమైతే మరో పెట్టుబడి బ్యాంకును కూడా ఈ ప్రక్రియలో భాగం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, ఈ ప్రణాళికలు ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్నాయని, మార్కెట్ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 1929లో ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం చౌహాన్ కుటుంబం ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పార్లే ఉత్పత్తులకు గణనీయమైన డిమాండ్

పార్లే-జీ, క్రాక్‌జాక్, మొనాకో,హైడ్ అండ్ సీక్ వంటి బిస్కెట్లతో పాటు మ్యాంగో బైట్,మెలోడీ,పాపిన్స్ వంటి ప్రముఖ మిఠాయిల ద్వారా ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. అంతేకాదు, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, మధ్యప్రాచ్య దేశాలు,ఆఫ్రికా సహా అనేక అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పార్లే ఉత్పత్తులకు గణనీయమైన డిమాండ్ ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 8.5శాతం పెరిగి రూ.15,568 కోట్లకు చేరుకుంది. అయితే, ఇదే కాలంలో నికర లాభం 39 శాతం తగ్గి రూ.979కోట్లుగా నమోదైంది. ఐపీఓపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో స్పందించిన కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మయాంక్ షా, మార్కెట్‌లో జరుగుతున్న ఊహాగానాలపై సంస్థ ఎలాంటి వ్యాఖ్యలు చేయదని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

పార్లే ఆగ్రోకు చెందిన ఫ్రూటీ, యాపీ ఫిజ్ వంటి పానీయాల బ్రాండ్లు

ప్రస్తుతం తమ ప్రధాన దృష్టి వ్యాపార విస్తరణ, వృద్ధిపైనే ఉందని తెలిపారు. ఒకవేళ ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం ఈ ఐపీఓ అమలైతే, భారత ఎఫ్‌ఎంసీజీ (FMCG) రంగ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే, ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉంది. చౌహాన్ కుటుంబంలో జరిగిన విభజన తర్వాత ఏర్పడిన 'పార్లే ఆగ్రో' సంస్థకు ఈ పార్లే ప్రొడక్ట్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఫ్రూటీ, యాపీ ఫిజ్ వంటి పానీయాల బ్రాండ్లు పార్లే ఆగ్రోకు చెందినవే.

Advertisement