Paytm: ఉద్యోగాల కోతల మధ్య పేటీఎం భారీ నియామకాలు.. 2027 నాటికి మరో 4,000 మందికి ఉద్యోగాలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఫిన్టెక్ దిగ్గజం పేటియం (Paytm) మరోసారి భారీ నియామకాలకు సిద్ధమవుతోంది. తాజా ఉద్యోగాల కోతలు చేపడుతున్నప్పటికీ, వచ్చే తొమ్మిది నెలల్లో సుమారు 4,000 మంది కొత్త ఉద్యోగులను నియమించనున్నట్లు సంస్థ ప్రకటించింది. వ్యాపారుల నెట్వర్క్ విస్తరణతో పాటు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఉత్పత్తులు, సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
వివరాలు
4,000 కొత్త ఉద్యోగాలు.. 400 మందికి ఉద్వాసన
ప్రస్తుతం పేటీఎంలో సుమారు 40 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త నియామకాలతో ఉద్యోగుల సంఖ్య దాదాపు 10 శాతం పెరగనుంది. మరోవైపు, వార్షిక పనితీరు సమీక్ష (Performance Appraisal) అనంతరం సుమారు 1 శాతం మంది ఉద్యోగులను, అంటే దాదాపు 400 మందిని తొలగిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. గత ఏడాది కూడా సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు విధించింది. ఆర్బీఐ చర్యల తర్వాత వ్యాపార వ్యూహంలో మార్పులు రెండేళ్ల క్రితం పేటీఎం అనుబంధ బ్యాంకింగ్ సంస్థపై భారత నియంత్రణ సంస్థలు కఠిన చర్యలు తీసుకున్న తర్వాత కంపెనీ తన వ్యాపార విధానాన్ని పూర్తిగా మార్చుకుంటోంది.
వివరాలు
మార్చి 2027 వరకు నియామకాలు కొనసాగింపు
సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ లక్షలాది మంది వినియోగదారులను రుణాలు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సేవల వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 2027 వరకు నియామక ప్రక్రియ కొనసాగనుంది. ఉత్పత్తుల అభివృద్ధి, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగాలతో పాటు సీనియర్ లీడర్షిప్ పోస్టులకు కూడా నియామకాలు చేపట్టనున్నారు. గత రెండు నెలల్లోనే 800 మందికి పైగా ఉద్యోగులను చేర్చుకున్నామని, మరో 4,000 మంది నియామక ప్రక్రియ కొనసాగుతోందని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది.
వివరాలు
వరుసగా నాలుగు త్రైమాసికాల్లో లాభాలు
ఆర్బీఐ చర్యలతో ఎదురైన సంక్షోభం నుంచి పేటీఎం క్రమంగా కోలుకుంటోంది. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో సంస్థ లాభాలు నమోదు చేసింది. అయితే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై విధించిన ఆంక్షల తర్వాత సంస్థ 4,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. అనంతరం ఆర్బీఐ ఆ బ్యాంక్ నిర్వహణ లైసెన్స్ను రద్దు చేయడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. మూసివేత దిశగా పేటీయం పేమెంట్స్ బ్యాంక్ గత రెండేళ్లలో పేటీయం పేమెంట్స్ బ్యాంక్ తన ఉద్యోగుల్లో చాలా మందిని తొలగించింది. కొందరిని పేటీఎం గ్రూప్లోని ఇతర విభాగాల్లోకి మార్చింది. ప్రస్తుతం మిగిలిన కొద్దిమంది ఉద్యోగులను కూడా బ్యాంక్ మూసివేత ప్రక్రియలో భాగంగా తొలగించనుంది.
వివరాలు
మొబైల్ రీచార్జ్ల నుంచి ఫిన్టెక్ దిగ్గజంగా
2010లో విజయ్ శేఖర్ శర్మ స్థాపించిన పేటీఎం తొలుత మొబైల్ ప్రీపెయిడ్ రీచార్జ్ సేవలతో ప్రారంభమైంది. అనంతరం డిజిటల్ చెల్లింపులు, బ్యాంకింగ్ సేవల రంగంలోకి ప్రవేశించింది. 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపుల విప్లవంలో పేటీఎం కీలక సంస్థగా ఎదిగింది. షేర్ మార్కెట్లో మిశ్రమ ప్రదర్శన ఒకప్పుడు సాఫ్ట్బ్యాంక్, అలీబాబా వంటి అంతర్జాతీయ దిగ్గజాల మద్దతు పొందిన పేటీఎం 2021లో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. గత ఏడాదిలో కంపెనీ షేర్లు సుమారు 7 శాతం పెరిగినప్పటికీ, ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ధరతో పోలిస్తే ఇప్పటికీ 50 శాతానికి పైగా తగ్గుదలలోనే కొనసాగుతున్నాయి.