Walmart: ఐపీఓ కంటే ప్రాఫిట్స్ ముఖ్యం.. ఫ్లిప్కార్ట్కు వాల్మార్ట్ కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్మార్ట్, ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐపీఓ (IPO) ప్రణాళికలను పక్కన పెట్టి, ముందుగా లాభదాయకత సాధించడంపై దృష్టి పెట్టాలని వాల్మార్ట్ సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు EBITDA బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకోవాలని కంపెనీ యాజమాన్యం ఫ్లిప్కార్ట్కు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. EBITDA అంటే వడ్డీలు, పన్నులు, డిప్రిషియేషన్, అమోర్టైజేషన్కు ముందున్న ఆదాయాన్ని సూచిస్తుంది. సంస్థ అసలు వ్యాపార పనితీరు ఎలా ఉందో అంచనా వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.
వివరాలు
బెంగళూరు పర్యటనలో కీలక నిర్ణయం
వాల్మార్ట్ సీఈఓ, ప్రెసిడెంట్ జాన్ ఫర్నర్ గత వారం బెంగళూరుకు వచ్చిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఫ్లిప్కార్ట్ బృందంతో సమావేశమైన ఆయన, కొత్త పెట్టుబడులు సమీకరించడం కంటే లాభదాయకతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. "2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు EBITDA బ్రేక్ ఈవెన్ చేరుకోవాలని ఫ్లిప్కార్ట్ అంతర్గతంగా టార్గెట్ పెట్టుకుంది. ఆ లక్ష్యం నెరవేరే వరకు ఐపీఓ గానీ, ప్రీ-ఐపీఓ ఫండింగ్ రౌండ్ గానీ చేపట్టకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ అంశంపై ఫ్లిప్కార్ట్ అధికారికంగా స్పందించలేదు.
వివరాలు
ఫోన పే తర్వాత మరో ఐపీఓ వాయిదా
వాల్మార్ట్ ఆధ్వర్యంలో IPO వాయిదా పడుతున్న రెండో భారతీయ సంస్థగా PhonePe నిలిచింది. ప్రస్తుతం PhonePeలో వాల్మార్ట్కు 71.8 శాతం వాటా ఉండగా, Flipkartలో 80 శాతం కంటే ఎక్కువ వాటా ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్ NASDAQలో లిస్టెడ్ కంపెనీ అయిన వాల్ మార్ట్ ప్రస్తుతం 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను దాటింది. గత 12 నెలల్లో వాల్మార్ట్ షేర్ ధర 36 శాతం పెరిగి ప్రస్తుతం ఒక్కో షేర్ 132.4 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2018లో Flipkartను కొనుగోలు చేసిన సమయంలో వాల్ మార్ట్ మార్కెట్ విలువ సుమారు 300 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది 1 ట్రిలియన్ డాలర్లను దాటింది.
వివరాలు
లాభదాయకతపై వాల్మార్ట్ ఫోకస్
అంటే ఎనిమిదేళ్లలో దాదాపు 700 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ పెరిగినట్లు తెలుస్తోంది. ఫ్లిప్కార్ట్ లాభదాయకత పెంచాలని వాల్ మార్ట్ ఒత్తిడి తీసుకురావడం కొత్త విషయం కాదు. ఇప్పటికే 2025లో ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ విభాగం తన నికర నష్టాన్ని 37 శాతం మేర తగ్గించి రూ.1,494.2 కోట్లకు తీసుకువచ్చింది. అంతకుముందు FY24లో ఈ నష్టం రూ.2,358.7 కోట్లుగా నమోదైంది. అయితే గ్రూప్ స్థాయిలో ఫ్లిప్కార్ట్ నష్టాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. ఫ్లిప్కార్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో మింత్రా, క్లియర్ట్రిప్, ఇ-కార్ట్, సూపర్.మనీ, షాప్సీ వంటి వ్యాపారాలు ఉన్నాయి.
వివరాలు
క్విక్ కామర్స్ పోటీతో ఒత్తిడి
ప్రస్తుతం Flipkart తన 10 నిమిషాల గ్రోసరీ డెలివరీ సేవ నిమిషాలను వేగంగా విస్తరిస్తోంది. అయితే ఈ వ్యాపారానికి భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. ఎందుకంటే అమెజాన్ నౌ, రిలయన్స్ రిటైల్కు చెందిన JioMart, Blinkit, Zepto, BigBasket, Swiggy Instamart వంటి సంస్థలతో ఫ్లిప్కార్ట్ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అన్ని వ్యాపారాలపై సమానంగా ఖర్చు చేయకుండా, కీలక రంగాలకే పెట్టుబడులు కేటాయించే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
వివరాలు
ప్రీ-IPO ఫండింగ్కూ బ్రేక్?
ఇటీవల Flipkart 2 నుంచి 2.5 బిలియన్ డాలర్ల ప్రీ-IPO ఫండింగ్ రౌండ్పై పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే లాభదాయకతపై దృష్టి పెట్టాల్సిన సమయంలో కొత్త ఫండింగ్ యత్నాలు టాప్ మేనేజ్మెంట్ దృష్టి మరల్చే ప్రమాదం ఉందని వాల్ మార్ట్ అంతర్గత చర్చల్లో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్ ఆధిపత్యం ICICI సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, మొత్తం GMV (Gross Merchandise Value) ఆధారంగా భారత ఈ-కామర్స్ మార్కెట్లో Flipkartకు 50-60 శాతం మార్కెట్ వాటా ఉంది. అలాగే నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 220 మిలియన్లుగా నమోదైందని, ఇది మీసో (200 మిలియన్లు), అమెజాన్ (150 మిలియన్లు) కంటే ఎక్కువ అని నివేదిక తెలిపింది.
వివరాలు
వాల్మార్ట్లో నాయకత్వ మార్పులు
ఇదిలా ఉండగా, గత కొన్ని నెలల్లో వాల్ మార్ట్ గ్లోబల్ స్థాయిలో కీలక నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. సీఈఓ డగ్ మెక్మిలన్ పదవీ విరమణ చేయగా, అంతర్జాతీయ వ్యాపార విభాగాధిపతి కాథరిన్ మెక్లే కూడా సంస్థను వీడారు. ఫ్లిప్కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తికు వాల్ మార్ట్ మాజీ నేతృత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా ఫ్లిప్ కార్ట్ ఐపీఓపై పలుసార్లు ప్రకటనలు వచ్చినప్పటికీ, అవి అమలుకాలేదు. 2019లో అమెరికాలో లిస్టింగ్పై ఆలోచన, 2021లో IPOసంకేతాలు, 2022లో తదుపరి ఏడాది IPOఅవకాశం వంటి వ్యాఖ్యలు వినిపించినా, ఇప్పటివరకు అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మాత్రం ఫ్లిప్ కార్ట్కు ప్రధాన లక్ష్యం లాభదాయకత సాధించడమేనని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.