India first MRI machine: బెంగళూరు స్టార్టప్ సరికొత్త ఆవిష్కరణ.. భారత్లోనే తయారైన తొలి MRI యంత్రం
ఈ వార్తాకథనం ఏంటి
భారత వైద్యరంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది. ఇప్పటివరకు విదేశాల నుంచి భారీ వ్యయంతో దిగుమతి చేసుకునే మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) యంత్రాలను ఇకపై దేశీయంగానే తయారు చేసే దిశగా భారత్ ముందుకు సాగుతోంది. బెంగళూరుకు చెందిన వోక్సెల్గ్రిడ్స్ (Voxelgrids) సంస్థ తక్కువ ధర,తక్కువ బరువుతో కూడిన స్వదేశీ MRI యంత్రాలను అభివృద్ధి చేసింది. ఆధునిక వైద్య పరీక్షలను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడమే సంస్థ ప్రధాన లక్ష్యంగా చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా MRI యంత్రాల తయారీలో అమెరికా,జర్మనీ,జపాన్,చైనా,ఇటలీ,నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. భారత్ కూడా ఇప్పటివరకు ఈ పరికరాల కోసం విదేశాలపైనే ఆధారపడుతోంది.
వివరాలు
బెంగళూరు వేదికగా వోక్సెల్గ్రిడ్స్ సంస్థను స్థాపించిన అర్జున్ అరుణాచలం
ప్రతి సంవత్సరం దాదాపు రూ.3,500 కోట్ల విలువైన MRI సంబంధిత పరికరాలు దేశానికి దిగుమతి అవుతున్నాయని అంచనాలు సూచిస్తున్నాయి.
ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో బెంగళూరుకు చెందిన అర్జున్ అరుణాచలం వోక్సెల్గ్రిడ్స్ సంస్థను స్థాపించారు.
ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన వైద్య పరికరాల్లో ఒకటిగా భావించే MRI యంత్రాన్ని స్వదేశీ సాంకేతికతతో రూపొందించడం చిన్న విషయం కాదు.
అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పోటీ పడాల్సి రావడంతో స్టార్టప్ అనేక సవాళ్లను ఎదుర్కొంది.
వివరాలు
తన్ టాటాతో సమావేశం.. టాటా ట్రస్ట్స్ నుండి సంస్థకు తొలి విడత ఆర్థిక సహాయం
ఈ క్రమంలో ఒక విదేశీ కంపెనీ నుంచి వచ్చిన ఆకర్షణీయమైన ఆఫర్ను కూడా అర్జున్ అరుణాచలం తిరస్కరించారు.
ఆ సంస్థలో చేరడం లేదా తన కంపెనీని విక్రయించడం ద్వారా తక్షణ ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ, అలా చేస్తే స్వదేశీ సాంకేతికతపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన భావించారు.
అందుకే భారతదేశంలోనే పరిశోధనలు కొనసాగించి, దేశీయ సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికే ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ ప్రయాణంలో టాటా ట్రస్ట్స్ కీలక పాత్ర పోషించింది. 2015లో అప్పటి టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటాతో జరిగిన సమావేశం అనంతరం సంస్థకు తొలి విడత ఆర్థిక సహాయం లభించింది.
వివరాలు
సాంప్రదాయ పరికరాలతో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువ ధరలో..
తర్వాత 2021లో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కూడా గణనీయమైన పెట్టుబడులతో సంస్థకు అండగా నిలిచారు.
ఈ మద్దతుతో పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, తయారీ సామర్థ్యాలను వోక్సెల్గ్రిడ్స్ మరింత విస్తరించగలిగింది.
సంస్థ రూపొందించిన స్వదేశీ MRI యంత్రాలు ప్రస్తుతం వినియోగంలో ఉన్న సాంప్రదాయ పరికరాలతో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువ ధరలో లభిస్తాయని సంస్థ వెల్లడిస్తోంది.
అలాగే వాటి బరువు సుమారు 50 శాతం తక్కువగా ఉండటంతో ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడం సులభం కావడంతో పాటు మౌలిక వసతులపై అయ్యే ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది.
అంతేకాకుండా, ఈ సాంకేతికత వల్ల MRI స్కానింగ్ ఖర్చు దాదాపు 70 శాతం వరకు తగ్గే అవకాశముందని అర్జున్ అరుణాచలం తెలిపారు.
వివరాలు
పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా MRI సేవలను విస్తరించే అవకాశాలు
దీంతో ఇప్పటివరకు ఖరీదైన కారణంగా అందుబాటులో లేని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా MRI సేవలను విస్తరించే అవకాశాలు మెరుగుపడనున్నాయి.
విదేశీ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్న వైద్య పరికరాల రంగంలో ఒక భారతీయ స్టార్టప్ స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా ముందుకు రావడం దేశానికి కీలక పరిణామంగా భావిస్తున్నారు.
ఇది కేవలం మరో వైద్య పరికరం తయారీ మాత్రమే కాదు.. ఆధునిక వైద్య సేవలను తక్కువ ఖర్చుతో సామాన్య ప్రజలకు చేరువ చేయాలనే భారత్ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తోంది.