Vijaypat Singhania Death: దిగ్గజ వ్యాపారవేత్త, రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్పత్ సింఘానియా కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
భారత పారిశ్రామిక రంగంలో కీలక స్థానాన్ని సంపాదించిన ప్రముఖ వ్యాపారవేత్త, విజయ్పత్ సింఘానియా(Vijaypat Singhania) (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శనివారం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని ఆయన కుమారుడు, గౌతమ్ సింఘానియా అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదిక అయిన X లో ఈ విషయాన్ని వెల్లడించారు. విజయ్పత్ సింఘానియా నాయకత్వంలో రేమండ్ గ్రూప్ విశేషంగా ఎదిగింది. చిన్న స్థాయి సంస్థగా ఉన్న రేమండ్ను ఆయన ప్రపంచస్థాయి బ్రాండ్గా మార్చారు. భారతదేశంలో గుర్తింపు పొందిన ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా నిలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గౌతమ్ సింఘానియా చేసిన ట్వీట్
RIP. Om Shanti 🙏 pic.twitter.com/nGtOGAEtHt
— Gautam Singhania (@SinghaniaGautam) March 28, 2026
వివరాలు
Park Avenue బ్రాండ్
దాదాపు 20 సంవత్సరాల పాటు రేమండ్ సంస్థకు ఆయన నాయకత్వం వహించారు. 1980 నుంచి 2000వరకు ఛైర్మన్గా కొనసాగుతూ,మెన్స్ ఫ్యాషన్ రంగంలో రేమండ్ను అగ్రగామిగా తీర్చిదిద్దారు. ప్రారంభంలో కేవలం ఉలెన్ దుప్పట్లు తయారు చేసే కంపెనీగా ఉన్న రేమండ్ను,ఆయన ఆధునిక వస్త్ర పరిశ్రమగా రూపుదిద్దారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో సూటింగ్,షర్టింగ్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. సామాన్యులకు సూట్ అనే భావనను చేరువ చేసిన వ్యక్తిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. టెక్స్టైల్ రంగంతో పాటు ఇతర విభాగాల్లో కూడా ఆయన అడుగుపెట్టారు. ముఖ్యంగా Park Avenue వంటి బ్రాండ్లను ప్రారంభించి కంపెనీ విస్తరణకు దోహదపడ్డారు. అలాగే"ది కంప్లీట్ మ్యాన్"అనే ట్యాగ్లైన్ను కూడా ఆయన రూపొందించారు.దీంతో ఆయనకే ఆ పేరు గుర్తింపుగా మారింది.
వివరాలు
పద్మభూషణ్ పురస్కారం
వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా, సింఘానియా ఒక నైపుణ్యమైన ఏవియేటర్గా కూడా ప్రసిద్ధి పొందారు. 5,000 గంటలకు పైగా విమానయాన అనుభవం ఆయన సొంతం. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం అందించింది. 67 ఏళ్ల వయసులో హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా అత్యధిక ఎత్తుకు చేరి ప్రపంచ రికార్డు సృష్టించారు. అలాగే 1988లో లండన్ నుంచి ఢిల్లీ వరకు మైక్రోలైట్ విమానంలో 23 రోజుల పాటు ఒంటరిగా ప్రయాణించి మరో అరుదైన ఘనతను సాధించారు.
వివరాలు
కుటుంబ విభేదాలు
2000సంవత్సరంలో కంపెనీ బాధ్యతలను తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించారు. అదే సమయంలో తన వద్ద ఉన్న 37%వాటాను కూడా ఆయనకు బదిలీ చేశారు. అనంతరం కొంతకాలానికి తండ్రీకొడుకుల మధ్య ఆస్తివివాదాలు తలెత్తాయి. ముంబైలోని అత్యంత ఖరీదైన గృహాలలో ఒకటైన JKHouseను వదిలి అద్దె ఇంటికి మారాల్సిన పరిస్థితి ఆయనకు ఎదురైంది. ఈవివాదం కోర్టు వరకు కూడా వెళ్లింది.ఒకప్పుడు వేల కోట్లు సంపాదించి.. చరమాంకంలో అద్దె ఇంట్లో నివసించాల్సిన పరిస్థితి తలెత్తిందని కూడా విజయ్పత్ ఒక సందర్భంలో చెప్పారు. ఒకప్పుడు సుమారు రూ.12,000కోట్ల సంపదతో Mukesh Ambani,Ratan Tata,Gautam Adani కంటే కూడా ధనవంతుడిగా నిలిచారు. అయితే ఆస్తి బదిలీ తర్వాత ఆయన సంపద తగ్గుతూ వచ్చింది.తర్వాత తండ్రీకొడుకులు.. సమస్యల్ని పరిష్కరించుకున్నట్లు తెలిసింది.