
RBI dividend payout: కేంద్రానికి ఆర్బీఐ గుడ్న్యూస్.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) భారీగా డివిడెండ్ రూపంలో నిధులను చెల్లించబోతోంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ మొత్తం రూ.2.69 లక్షల కోట్లను కేంద్రానికి డివిడెండ్గా అందజేయనున్నట్లు ప్రకటించింది.
ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 27.4 శాతం అధికం. 2023-24లో కేంద్రానికి ఆర్బీఐ రూ.2.1 లక్షల కోట్లు డివిడెండ్గా ఇచ్చింది.
అంతకముందు 2022-23 సంవత్సరానికి కేవలం రూ.87,416 కోట్లు మాత్రమే చెల్లించింది.
ఈ సంఖ్య ఏటేటా క్రమంగా పెరిగిపోతూ వస్తోంది. ఈ నిర్ణయం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన 616వ కేంద్ర బోర్డు డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్నారు.
వివరాలు
కంటిజెంట్ రిస్క్ బఫర్ స్థాయి 6.5 శాతం నుంచి 7.5 శాతానికి పెంపు
దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను, రిస్క్ అంశాలను సమీక్షించిన అనంతరం ఈ భారీ మొత్తాన్ని కేంద్రానికి బదిలీ చేయాలని ఆమోదించారు.
అదేవిధంగా,కంటిజెంట్ రిస్క్ బఫర్ స్థాయిని 6.5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు.
ఆర్బీఐ ప్రతి సంవత్సరం తన ఆదాయ వ్యయాల తేడాను మిగులు నిధులుగా గుర్తించి,వాటిని కేంద్రానికి డివిడెండ్గా అందజేస్తుంది.
ఆర్బీఐకి ఆదాయం దేశీయ, విదేశీ పెట్టుబడులపై వడ్డీ రూపంలో, సేవలపై వసూలు చేసే రుసుములు, కమీషన్లు, విదేశీ మారక లావాదేవీల లాభాలు, అనుబంధ సంస్థల నుంచి వచ్చే డివిడెండ్లు వంటివి ఉంటాయి.
ఇదిలా ఉండగా, వ్యయాల్లో కరెన్సీ ముద్రణ ఖర్చులు, డిపాజిట్లపై చెల్లించే వడ్డీలు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, అత్యవసర సందర్భాలకు కేటాయింపులు ముఖ్యమైనవి.
వివరాలు
డివిడెండ్ల ద్వారా రూ.2.56 లక్షల కోట్లు వస్తాయని అంచనా
ఈ ఆదాయ-వ్యయాల మధ్య ఉన్న తేడానే మిగులు నిధులుగా గుర్తించబడుతుంది. వాటిని ప్రతి సంవత్సరం కేంద్రానికి బదిలీ చేస్తారు.
ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం ఆర్బీఐతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ల ద్వారా రూ.2.56 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసింది.
కానీ ఇప్పుడే ఆర్బీఐ ఒక్కటే ఆ అంచనాలను మించిపోయిన స్థాయిలో రూ.2.69 లక్షల కోట్లు డివిడెండ్గా ప్రకటించడం విశేషంగా నిలిచింది.