RBI:విదేశీ స్టాక్ మార్కెట్లలో భారత కంపెనీల నమోదుకు ఆర్బీఐ కొత్త నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడం, విదేశీ పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేయడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. కేంద్ర బడ్జెట్ 2026-27లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనకు అనుగుణంగా విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ (ఫెమా) నిబంధనల్లో సమగ్ర మార్పులు తీసుకురావాలని ఈ ప్రతిపాదనల్లో పేర్కొంది. వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడం, నిబంధనల్లో స్పష్టత తీసుకురావడం, విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశమని ఆర్బీఐ వెల్లడించింది. ఈ ప్రతిపాదనలపై ప్రజలు, పరిశ్రమల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలను ఆగస్టు 31లోగా సమర్పించవచ్చని తెలిపింది.
వివరాలు
జారీ చేసే షేర్ల విలువ కంపెనీ ఖాతా పుస్తకాల్లో రూపాయల్లోనే నమోదు కావాలి
ప్రతిపాదిత నిబంధనల ప్రకారం భారతీయ పబ్లిక్ కంపెనీలు తమ ఈక్విటీ షేర్లను విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జారీ చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటాదారులు తమ షేర్లను విక్రయించడానికి కొన్ని షరతులతో అనుమతి లభిస్తుంది.
జారీ చేసే షేర్ల విలువ కంపెనీ ఖాతా పుస్తకాల్లో రూపాయల్లోనే నమోదు కావాలి.
అలాగే అన్ని షేర్లు డీమ్యాట్ రూపంలో ఉండటం తప్పనిసరి.
దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇప్పటికే నమోదైన కంపెనీలు విదేశీ లిస్టింగ్కు వెళ్లాలంటే భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) నిబంధనలను కూడా తప్పనిసరిగా పాటించాలి.
విదేశాల్లో జారీ చేసే షేర్లకు దేశీయ షేర్లతో సమాన హక్కులు ఉండాలని ముసాయిదాలో స్పష్టం చేసింది.
వివరాలు
లిస్టింగ్ లేని కంపెనీలు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనలకు లోబడి ఉండాలి
దేశీయంగా లిస్టింగ్ లేని కంపెనీలు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.
దేశీయ మార్కెట్లో నమోదు కాకుండానే విదేశీ మార్కెట్లో తొలిసారిగా లిస్టింగ్ అయ్యే కంపెనీల షేర్ల ధరను బుక్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్ణయించనున్నట్లు పేర్కొంది.
అదేవిధంగా విదేశీయులు, విదేశీ నియంత్రణలో ఉన్న సంస్థలు కొనుగోలు లేదా బహుమతుల రూపంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
ఈ పెట్టుబడులు విదేశాలకు తిరిగి తీసుకెళ్లే (రిపాట్రియబుల్) లేదా తీసుకెళ్లలేని (నాన్-రిపాట్రియబుల్) విధానాల్లో ఉండొచ్చని ముసాయిదాలో వివరించింది.
వివరాలు
ఎన్పీఎస్లో ప్రవాస భారతీయులకు అవకాశం
ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), భారత సంతతి వ్యక్తులు (పీఐఓలు) పింఛన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో పెట్టుబడులు పెట్టేందుకు అర్హులని ఆర్బీఐ పేర్కొంది.
ఈ పథకంలో చేసిన పొదుపు మొత్తాలను విదేశాలకు బదిలీ చేసుకునే అవకాశమూ ఉంటుంది.
ప్రజలు, పరిశ్రమల నుంచి వచ్చే సూచనలను పరిశీలించిన అనంతరం ఈ ముసాయిదా నిబంధనలను ఆర్బీఐ తుది రూపంలో అమలు చేయనుంది.