RBI: ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్..వడ్డీ రేట్లు పెంచేందుకు ఆర్బీఐ రెడీ?
ఈ వార్తాకథనం ఏంటి
ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని సిస్టమాటిక్స్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. అక్టోబర్ తొలి వారంలో జరగనున్న ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ దిశగా తొలి సంకేతాలు వెలువడొచ్చని పేర్కొంది. ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటు దశలవారీగా 6.5శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82శాతానికి చేరింది. జులైలో నమోదైన 4.45శాతంతో పోలిస్తే ఇది పెరుగుదల. కొత్త సిరీస్లో ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. వరుసగా మూడో నెలలోనూ ఆర్బీఐ లక్ష్యంగా నిర్దేశించుకున్న 4శాతం మధ్యస్థ స్థాయిని రిటైల్ ద్రవ్యోల్బణం అధిగమించింది.
వివరాలు
ఆహార ధరలతో మరింత ఒత్తిడి
ఆహార ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో 5.95 శాతానికి పెరిగింది. జులైలో ఇది 5.52 శాతంగా ఉంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరల పెరుగుదల అధికంగా నమోదైంది. అక్కడ ఆహార ద్రవ్యోల్బణం 6.13 శాతానికి చేరింది.
హోల్సేల్ ద్రవ్యోల్బణం కూడా పైపైకి
హోల్సేల్ ధరల ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.92 శాతానికి పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 9.78 శాతంగా నమోదైంది.
కూరగాయలు, సుగంధ ద్రవ్యాల ధరలు ప్రధాన ఒత్తిడిని సృష్టిస్తున్నాయని సిస్టమాటిక్స్ గ్రూప్ నివేదిక తెలిపింది.
ఇంధనం, ఇంధన ఆధారిత ఉత్పత్తుల ధరలు, తయారీ వ్యయాలు కూడా ధరల పెరుగుదలను ఇతర రంగాలకు విస్తరింపజేస్తున్నాయని పేర్కొంది.
వివరాలు
అక్టోబర్-నవంబర్లో 6 శాతం దాటొచ్చా?
ద్రవ్యోల్బణం ఇదే వేగంతో కొనసాగితే అక్టోబర్-నవంబర్ నాటికి అది 6 శాతాన్ని అధిగమించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
ఎల్నినో ప్రభావంతో ఆహార సరఫరాపై ఒత్తిడి పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు ద్రవ్యోల్బణానికి మరింత ముప్పుగా మారొచ్చని తెలిపింది.