RBI monetary policy: ఆర్బీఐ కీలక నిర్ణయం.. 5.25శాతం వద్ద రెపో రేటు యథాతథం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కీలక వడ్డీ రేట్ల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి యథాతథ నిర్ణయం తీసుకుంది. అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భావించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తూ ఆర్బీఐ తన పాలసీ స్టాన్స్ను 'న్యూట్రల్'గానే కొనసాగిస్తోందని వెల్లడించారు.
వివరాలు
అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం భారత్కు ఉంది
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వాణిజ్య మార్గాలు, సరఫరా గొలుసులు అనేక ఆటంకాలను ఎదుర్కొంటున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. మార్కెట్లలో పెరుగుతున్న అనిశ్చితి, ఒడిదుడుకుల కారణంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఇలాంటి సవాళ్లను తట్టుకుని నిలబడే శక్తి భారత ఆర్థిక వ్యవస్థకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులను కేవలం సవాలుగా కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే అవకాశంగా మలుచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
వరుసగా మూడోసారి మార్పుల్లేవు
జూన్ ద్రవ్య పరపతి సమీక్షతో కలిపి వరుసగా మూడోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. గత ఏడాది డిసెంబర్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన కేంద్ర బ్యాంక్, అనంతరం ఏప్రిల్ సమీక్షలోనూ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఇప్పుడు జూన్ సమీక్షలో కూడా అదే నిర్ణయాన్ని కొనసాగించింది. మానిటరీ పాలసీ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఓటు వేసి రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించినట్లు గవర్నర్ తెలిపారు.
వివరాలు
స్థిరంగా ఇతర రేట్లు
రెపో రేటులో మార్పు లేకపోవడంతో దానికి అనుబంధంగా ఉండే ఇతర కీలక వడ్డీ రేట్లు కూడా యథాతథంగా కొనసాగుతున్నాయి. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) రేటు: బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఆర్బీఐ వద్ద జమ చేసేందుకు ఉపయోగించే ఈ రేటు 5 శాతంగానే కొనసాగుతుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు: అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై వర్తించే ఈ రేటు 5.5 శాతంగానే కొనసాగుతుంది.
వివరాలు
రుణగ్రహీతలపై ప్రభావం ఏమిటి?
ఆర్బీఐ తాజా నిర్ణయంతో ప్రస్తుతం హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న రుణగ్రహీతల ఈఎంఐల్లో తక్షణ మార్పులు ఉండవు. అలాగే కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి కూడా ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లే వర్తించనున్నాయి.