LOADING...
Red Sea crisis explained:  ప్రపంచ వాణిజ్యానికి ముప్పు.. పెరగనున్న రవాణా ఖర్చులు
ప్రపంచ వాణిజ్యానికి ముప్పు.. పెరగనున్న రవాణా ఖర్చులు

Red Sea crisis explained:  ప్రపంచ వాణిజ్యానికి ముప్పు.. పెరగనున్న రవాణా ఖర్చులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2026
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే రెడ్‌సీ ప్రాంతం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిలిచింది. మెడిటరేనియన్ సముద్రాన్ని భారత మహాసముద్రంతో కలిపే సూయజ్ కాలువ,బాబ్-ఎల్-మందెబ్ జలసంధి ద్వారా జరిగే ఈ మార్గం ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 నుంచి 15 శాతం వరకు భాగస్వామ్యం కలిగి ఉంది. కంటైనర్ రవాణాలో 25-30 శాతం,సముద్ర మార్గంలో చమురు రవాణాలో 12 శాతం,ఎల్ఎన్జీ, ధాన్య రవాణాలో దాదాపు 8 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతోంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో నౌకలు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుండగా, ఒక్క సూయజ్ కాలువలోనే రోజుకు సగటున 60 నౌకలు ప్రయాణిస్తాయి. ఈ మార్గం మూసివేత ప్రపంచ వాణిజ్యానికి గట్టి దెబ్బగా మారే అవకాశం ఉంది.

వివరాలు 

రెడ్‌సీ మూసివేస్తే ఆటోమొబైల్,ఎలక్ట్రానిక్స్,యంత్రాల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం

రెడ్‌సీ మూసివేస్తే ఆసియా-యూరప్ మధ్య ప్రయాణించే నౌకలు ఆఫ్రికా దక్షిణ తీరంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం వైపు మళ్లాల్సి ఉంటుంది. దీంతో సుమారు 3,500 నుంచి 4,000 నాటికల్ మైళ్ళ దూరం పెరగడంతో పాటు 10 నుంచి 15 రోజుల ఆలస్యం ఏర్పడుతుంది. ఈ మార్పు వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగి, సరఫరా వ్యవస్థలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ప్రపంచ కంటైనర్ రవాణా సామర్థ్యం దాదాపు 9 శాతం వరకు తగ్గిపోతుందని అంచనా. దీనివల్ల ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, యంత్రాల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

వివరాలు 

రెడ్‌సీ ద్వారా ప్రయాణించే నౌకల సంఖ్య పడిపోయింది 

ఇటీవల ఉద్రిక్తతల కారణంగా షిప్పింగ్ చార్జీలు భారీగా పెరిగాయి. ఆసియా-యూరప్ మార్గాల్లో రవాణా ధరలు ఐదింతలు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. చైనా నుంచి ఉత్తర యూరప్‌కు ఒక కంటైనర్ రవాణా ఖర్చు 6,000 డాలర్ల వరకు చేరి,తరువాత 4,500 డాలర్ల వద్ద స్థిరపడింది. అయినప్పటికీ,ఇవి గత సగటు ధరల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఇదే సమయంలో రెడ్‌సీ ద్వారా ప్రయాణించే నౌకల సంఖ్య 100 నుంచి 40కి పడిపోవడం గమనార్హం. ఈ సంక్షోభం ప్రభావం కేవలం రవాణాకే పరిమితం కాదు. సరుకుల ధరలు పెరగడం, సరఫరా ఆలస్యం కావడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

ధాన్య రవాణా ఆలస్యమైతే ఆహార ధరలపై కూడా ప్రభావం

అలాగే ధాన్య రవాణా ఆలస్యమైతే ఆహార ధరలపై కూడా ప్రభావం పడుతుంది. యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలు ఈ ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనే అవకాశముండగా, సూయజ్ కాలువపై ఆధారపడే ఈజిప్ట్ వంటి దేశాలకు ఆదాయ నష్టాలు తలెత్తవచ్చు. మరోవైపు, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గంలో ఉన్న దేశాలకు కొంతవరకు లాభం కలగొచ్చు. నౌకలు కొత్త మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో, మార్గమధ్య దేశాల్లో ఇంధనం నింపడం, సరుకు నిర్వహణ సేవల అవసరం పెరిగి, అక్కడి దేశాలకు కొంత ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ, మొత్తం ప్రపంచ వాణిజ్యంపై పడే ప్రతికూల ప్రభావమే ఎక్కువగా ఉండనుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement