Reliance Jio IPO: జియో ఐపీఓకు గ్రీన్ సిగ్నల్.. నేడే సెబీకి డ్రాఫ్ట్ పత్రాలు: ముకేశ్ అంబానీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఐపీఓపై కీలక పరిణామం చోటుచేసుకుంది. జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పత్రాలకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ వెల్లడించారు. ఈ ముసాయిదా పత్రాలను శుక్రవారమే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించిన ముకేశ్ అంబానీ,జియో ఐపీఓ సంస్థ చరిత్రలో అత్యంత కీలక ఘట్టమని పేర్కొన్నారు. ''ఇది నాకు, రిలయన్స్ కుటుంబానికి, అలాగే కోట్లాది మంది వాటాదారులకు ఎంతో భావోద్వేగభరితమైన సందర్భం. జియో ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పత్రాలను బోర్డు ఆమోదించింది. ఈ రోజే వాటిని సెబీకి సమర్పించనున్నాం'' అని వెల్లడించారు.
వివరాలు
ఇష్యూ ధరను బుక్ బిల్డింగ్ విధానంలో నిర్ణయం
ఈ ఏడాదిలో రిలయన్స్కు జియో ఐపీఓ అత్యంత కీలక మైలురాయిగా నిలుస్తుందని అంబానీ చెప్పారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రస్తుత వాటాదారులకు గణనీయమైన విలువ సృష్టించడంతో పాటు, కొత్త పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థలను భారత్ నిర్మించగలదని జియో స్టాక్ మార్కెట్ లిస్టింగ్ ప్రపంచానికి చాటి చెబుతుందని పేర్కొన్నారు. జియో ఐపీఓకు సంబంధించిన వివరాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్లో కూడా వెల్లడించింది. ఒక్కో షేరు ముఖ విలువ రూ.10గా ఉండగా, ఫ్రెష్ ఇష్యూ ద్వారా 27 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్లు తెలిపింది. ఇష్యూ ధరను బుక్ బిల్డింగ్ విధానంలో నిర్ణయించనున్నట్లు స్పష్టం చేసింది.
వివరాలు
రిలయన్స్ ఏజీఎంలోనే జియో ఐపీఓపై ముకేశ్ అంబానీ సంకేతాలు
ఈ ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్లు,అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.36 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు నిధులను మార్కెట్ నుంచి సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. భారత కార్పొరేట్ చరిత్రలో ఇది అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది నిర్వహించిన రిలయన్స్ ఏజీఎంలోనే జియో ఐపీఓపై ముకేశ్ అంబానీ సంకేతాలు ఇచ్చారు. 2026 తొలి అర్ధభాగంలో ఈ పబ్లిక్ ఇష్యూ తీసుకురావాలని అప్పట్లో ప్రకటించారు.
వివరాలు
పెట్టుబడిదారుల్లో మరోసారి భారీ ఆసక్తి
అయితే, ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధరల్లో బలహీనత కనిపించడం, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో కంపెనీ ప్రధాన ఆదాయ వనరైన పెట్రోకెమికల్ వ్యాపారం ఒత్తిడిని ఎదుర్కొనడం వంటి కారణాలతో ఐపీఓ ప్రక్రియ ఆలస్యమైంది. అయితే తాజాగా బోర్డు ఆమోదం లభించి, సెబీకి డ్రాఫ్ట్ పత్రాల సమర్పణకు సిద్ధం కావడంతో జియో ఐపీఓ ప్రక్రియ అధికారికంగా ముందడుగు వేసినట్లైంది. దీంతో పెట్టుబడిదారుల్లో మరోసారి భారీ ఆసక్తి నెలకొంది.