Rupee Value: ఇంట్రా-డే ట్రేడ్లో తొలిసారిగా91 మార్క్ దాటిన రూపాయి
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ క్రమంగా బలహీనపడుతోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం, విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లడం వంటి అంశాలు రూపాయి మారకం విలువపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ క్రమంలో నేటి ట్రేడింగ్ సెషన్లో రూపాయి తొలిసారిగా 91 స్థాయిని దాటి, డాలరుతో పోలిస్తే సరికొత్త ఆల్టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. మునుపటి సెషన్లో డాలరుతో పోలిస్తే 90.78 వద్ద ముగిసిన రూపాయి, మంగళవారం మరింత దిగజారింది. ఉదయం 11.45 గంటల సమయంలో 36 పైసలు పడిపోయి 91.14 వద్దకు చేరింది. గడిచిన 10 ట్రేడింగ్ సెషన్లలోనే రూపాయి 90 స్థాయి నుంచి 91 స్థాయికి చేరడం గమనార్హం.
వివరాలు
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం వల్ల మదుపర్ల భావోద్వేగాలు దెబ్బతిని, దాని ప్రభావం రూపాయిపై ప్రతికూలంగా పడుతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్లలో అనిశ్చితి, డాలర్కు పెరిగిన డిమాండ్ కూడా రూపాయి బలహీనతకు కారణాలుగా పేర్కొంటున్నారు. ఇదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ సుమారు 500 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 25,900 స్థాయిని కోల్పోయింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి సెన్సెక్స్ 499 పాయింట్లు నష్టపోయి 84,714 వద్ద, నిఫ్టీ 154 పాయింట్లు తగ్గి 25,873 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, మదుపర్ల అప్రమత్త ధోరణి కారణంగా సూచీలపై ఒత్తిడి కొనసాగుతోంది.