Stock market: నాలుగో రోజు కూడా నష్టాల బాటలోనే సూచీలు.. 508 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ట్రేడింగ్ మధ్యలో గరిష్ఠ స్థాయులను తాకినప్పటికీ, ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో ప్రారంభంలో నమోదైన లాభాలు చెరిగిపోయి, ప్రధాన సూచీలు నష్టాల బాట పట్టాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ మార్కెట్లు ప్రతికూల ముగింపు నమోదు చేశాయి. పశ్చిమాసియాలో శాంతి పరిస్థితులపై కొనసాగుతున్న అనిశ్చితి, విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) విక్రయాలను కొనసాగించడం మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించింది.
వివరాలు
డాలర్తో రూపాయి మారకం విలువ 94.97
బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 74,775.74 పాయింట్లతో పోలిస్తే 75,203.02 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో 75,367.93 పాయింట్ల గరిష్ఠ స్థాయిని చేరుకున్న సూచీ,అనంతరం క్రమంగా క్షీణించింది. చివరకు 508.40 పాయింట్లు కోల్పోయి 74,267.34 వద్ద ముగిసింది.మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 165.15 పాయింట్లు తగ్గి 23,382.60 వద్ద స్థిరపడింది. విదేశీ మారక మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 94.97 వద్ద కొనసాగింది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు 94.01 డాలర్లు
సెన్సెక్స్లోని 30 కంపెనీల్లో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇండిగో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు 94.01 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 4,496 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.