Stock Market: నిఫ్టీ 25,550 కిందకు.. లాభాల స్వీకరణతో ఇన్వెస్టర్లలో టెన్షన్
ఈ వార్తాకథనం ఏంటి
నేటి (ఫిబ్రవరి 20)మధ్యాహ్నం ట్రేడింగ్లో మార్కెట్లో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) జోరందుకుంది. ఉదయం దాదాపు 0.8 శాతం వరకు ఎగబాకిన బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ మధ్యాహ్నానికి ఒత్తిడికి లోనయ్యాయి. రోజులో గరిష్ట స్థాయి నుంచి సెన్సెక్స్ 400 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 25,550 స్థాయి కింద ట్రేడ్ అయ్యింది. మధ్యాహ్నం 1:16 గంటల సమయానికి సెన్సెక్స్ 238 పాయింట్ల లాభంతో 82,736 వద్ద, నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 25,548 వద్ద కొనసాగింది. రోజులో సెన్సెక్స్ గరిష్టం 83,132 కాగా, నిఫ్టీ 25,663 వరకు చేరింది. మొత్తం మార్కెట్లో సుమారు 1,800 షేర్లు లాభాల్లో ఉండగా, 1,897 షేర్లు నష్టాల్లో కొనసాగాయి.
వివరాలు
మెటల్, ఫైనాన్స్ షేర్ల జోరు.. ఐటీపై ఒత్తిడి
నిఫ్టీ 50లో హిందాల్కో ఇండస్ట్రీస్(Hindalco Industries) దాదాపు 3 శాతం పెరిగి టాప్ గైనర్గా నిలిచింది. టాటా స్టీల్, JSW స్టీల్(Tata Steel, JSW Steel)షేర్లు కూడా 2 శాతం చొప్పున లాభపడ్డాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో బజాజ్ ఫిన్సర్వ్,సబీ లైఫ్ ఇన్సూరెన్స్ కో, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు సుమారు 1 శాతం పెరిగాయి. అలాగే హిందుస్థాన్ యూనిలీవర్, లార్సెన్ & టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 1-2 శాతం వరకు ఎగబాకాయి. అయితే ఐటీ రంగం ఒత్తిడికి లోనైంది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో షేర్లు సుమారు 1 శాతం చొప్పున పడిపోయాయి.
వివరాలు
జియోపాలిటికల్ టెన్షన్ ఎఫెక్ట్.. బ్రెంట్ జంప్,మార్కెట్ మిక్స్డ్ ట్రెండ్
మహీంద్రా & మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా నష్టాల్లో కొనసాగాయి. విస్తృత మార్కెట్లలో మిడ్క్యాప్ సూచీలు స్వల్ప లాభాల్లో ఉండగా, స్మాల్క్యాప్ సూచీల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. అపార్ ఇండస్ట్రీస్ షేర్ దాదాపు 5 శాతం పెరగడంతో మిడ్క్యాప్ 150కు మద్దతు లభించింది. మార్కెట్ లాభాలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ముందున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అణు కార్యక్రమంపై 10-15 రోజుల్లో ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 71.87 డాలర్లకు చేరుకున్నాయి. భారతదేశం భారీగా క్రూడ్ దిగుమతి చేసుకునే దేశం కావడంతో ఇది ప్రతికూలంగా మారింది.
వివరాలు
ఎఫ్ఐఐ అమ్మకాలు,బలహీన రూపాయి,ఐటీ పతనం.. మార్కెట్పై ఒత్తిడి పెరిగింది
మరోవైపు గురువారం (ఫిబ్రవరి 19) విదేశీ,దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా రూ.880 కోట్లు,రూ.596 కోట్ల షేర్లు విక్రయించారు. రూపాయి డాలర్తో పోలిస్తే 90.95 వద్ద బలహీనంగా ట్రేడ్ అయింది. ఐటీ షేర్లలో వరుసగా మూడో రోజు అమ్మకాలు కొనసాగాయి. పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్ నష్టాలకు దారితీశాయి. ఈ వారం నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 2.5 శాతం పడిపోయి వరుసగా ఆరో వారంలోనూ నష్టాలతో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. VK విజయకుమార్,జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ మాట్లాడుతూ బ్రెంట్ క్రూడ్ పెరుగుదలతో మార్కెట్లో అనిశ్చితి పెరిగిందని తెలిపారు.
వివరాలు
టెక్నికల్ అలర్ట్.. 25,000 దిశగా నిఫ్టీ? VIX జంప్తో మార్కెట్లో టెన్షన్
అలాగే యాక్సిస్ సెక్యూరిటీస్(Axis Securities) ప్రకారం నిఫ్టీ బేరిష్ మారుబోజు క్యాండిల్ను రూపొందించిందని, 25,500 కంటే దిగువకు క్లోజ్ కావడంతో సమీప కాలంలో 25,000 స్థాయికి పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రూపక్ దే, LKP సెక్యూరిటీస్ విశ్లేషణ ప్రకారం నిఫ్టీకి 25,800 స్థాయిలో తక్షణ ప్రతిఘటన (రెసిస్టెన్స్) కనిపిస్తోందని తెలిపారు. అదే సమయంలో మార్కెట్లో అస్థిరత సూచీ అయిన India VIX 7.65 శాతం ఎగిసి 14.49కి చేరుకోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన, అనిశ్చితి పెరిగిందని పేర్కొన్నారు. మొత్తం మీద భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్ ధరల పెరుగుదల, ఎఫ్ఐఐ-డీఐఐ అమ్మకాలు, బలహీన రూపాయి, ఐటీ షేర్ల పతనం వంటి అంశాలు మార్కెట్ లాభాలను తగ్గించాయని విశ్లేషకులు అంటున్నారు.