Stock market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. 444 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు జూలై 1న లాభాలతో ముగిశాయి. ఆర్థిక, ఆటో, ఎఫ్ఎంసీజీ (వినియోగ వస్తువుల) షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్కు బలమైన మద్దతు లభించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను మెరుగుపరిచింది. అయితే ఐటీ కంపెనీల షేర్లు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 443.97 పాయింట్లు లేదా 0.58 శాతం లాభపడి 76,922.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.10 పాయింట్లు లేదా 0.59 శాతం ఎగిసి 24,005.85 వద్ద స్థిరపడింది. మొత్తం 2,158 షేర్లు లాభపడగా, 1,935 షేర్లు నష్టపోయాయి. మరో 165 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
వివరాలు
ఆటో,ఎఫ్ఎంసీజీ షేర్ల జోష్
ఆటో రంగ షేర్లు 1.2 శాతం వరకు లాభపడ్డాయి.జూన్ నెల అమ్మకాలు ఆశాజనకంగా నమోదవడంతో అశోక్ లేలాండ్ షేరు 2.8శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 2శాతం పెరిగాయి. ఎఫ్ఎంసీజీ సూచీ 2.1శాతం పెరిగింది. నెస్లే ఇండియా షేరు 3.5శాతం,హిందుస్థాన్ యూనిలీవర్ షేరు 3 శాతం లాభపడాయి. వినియోగ వస్తువుల కంపెనీలు జూన్ త్రైమాసికంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసే అవకాశముందని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. అయితే ఎల్నినో ప్రభావం, బలహీనమైన రుతుపవనాలు భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్పై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు డిమాండ్పై ఆందోళనలు, అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశాల నేపథ్యంలో ఐటీ సూచీ వరుసగా నాలుగో రోజు కూడా క్షీణించి 2 శాతం పడిపోయింది.
వివరాలు
ఆటో,ఎఫ్ఎంసీజీ షేర్ల జోష్
ప్రధాన 16 రంగాల సూచీల్లో 12 లాభాల్లో ముగిశాయి. స్మాల్క్యాప్ సూచీ 0.4 శాతం, మిడ్క్యాప్ సూచీ 0.3 శాతం పెరిగాయి. ఆర్థిక రంగ షేర్లు 0.9 శాతం బలపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్ షేరు 1.7 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 2 శాతం లాభపడటంతో ఈ రంగానికి మద్దతు లభించింది. నిఫ్టీ-200 సూచీలో కేపీఐటీ టెక్నాలజీస్ షేరు అత్యధికంగా 16.5 శాతం క్షీణించింది. యూరప్కు చెందిన కొన్ని వాహన తయారీ సంస్థల వ్యాపార అంచనాలు బలహీనపడటంతో జూన్ త్రైమాసికంలో డాలర్ ఆదాయం, నిర్వహణ లాభాలు తగ్గే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.
వివరాలు
ముడి చమురు ధరల తగ్గుదల
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 73 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ చర్చల్లో స్పష్టమైన పురోగతి లేకపోయినా చమురు ధరలు పెద్దగా పెరగకపోవడం మార్కెట్కు అనుకూలంగా మారింది. ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రతినిధులతో ప్రస్తుతం సమావేశం కాబోమని ఇరాన్ ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య శాశ్వత పరిష్కారంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.
వివరాలు
టెక్నికల్గా మార్కెట్ పరిస్థితి
నిఫ్టీ 23,800 స్థాయికి పైన కొనసాగుతున్నంత వరకు మార్కెట్కు బలం కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 24,200 స్థాయిని నిలకడగా దాటితే మార్కెట్లో మళ్లీ బుల్లిష్ ధోరణి బలపడుతూ 24,400 వరకు ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని యాక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేశ్ పాల్వియా తెలిపారు. అలాగే 24,000 స్థాయిని బలంగా నిలబెట్టుకోలేకపోతే నిఫ్టీ మరోసారి 23,800-23,900 మద్దతు స్థాయిని పరీక్షించే అవకాశం ఉందన్నారు. కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ ప్రకారం, ప్రస్తుతం మార్కెట్ స్పష్టమైన దిశ లేకుండా కదులుతోంది.
వివరాలు
టెక్నికల్గా మార్కెట్ పరిస్థితి
24,000/77,000 స్థాయిలను నిలకడగా అధిగమిస్తే మార్కెట్ 24,150-24,200 లేదా 77,500-77,700 స్థాయిల దిశగా పయనించే అవకాశం ఉంది. అయితే 23,900-23,800 మద్దతు స్థాయిల కంటే దిగువకు పడిపోతే అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగి 23,700-23,600 లేదా 75,800-75,500 స్థాయిల వరకు మార్కెట్ క్షీణించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ, ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడడం మార్కెట్ సెంటిమెంట్కు ఊతమిచ్చాయని, సమీప కాలంలో మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కొనసాగవచ్చని అంచనా వేశారు.