
Stock Market: స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం - బ్యాంకింగ్ షేర్లలో దూకుడు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి.
అంతర్జాతీయంగా ఒత్తిడులు కొనసాగుతున్నప్పటికీ, దేశీయ మార్కెట్లు పాజిటివ్ వైపు కదలిక చూపించాయి.
అమెరికా ప్రభుత్వం విధించే టారిఫ్లపై ఆందోళనలు తగ్గిపోవడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది.
ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రధాన కంపెనీల షేర్లకు బలమైన కొనుగోళ్ల మద్దతు లభించింది.
దీంతో బ్యాంక్ నిఫ్టీ చారిత్రాత్మక గరిష్ఠస్థాయిని అధిగమించింది.
సెన్సెక్స్ ప్రారంభంలోనే దాదాపు 350 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించగా, నిఫ్టీ 23,900కు పైగా స్థాయిలో ప్రయాణం ప్రారంభించింది.
ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 428 పాయింట్లు పెరిగి 79,008 వద్ద, నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 23,955 వద్ద కొనసాగుతున్నాయి.
వివరాలు
మిశ్రమ ధోరణితో ముగిసిన అమెరికా స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 30 స్టాకుల్లో యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్,ఇన్ఫోసిస్,ఐసీఐసీఐ బ్యాంక్,ఎస్బీఐ,హెచ్సీఎల్ టెక్నాలజీస్,ఇండస్ఇండ్ బ్యాంక్,బజాజ్ ఫిన్సర్వ్,పవర్గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, నెస్లే ఇండియా, ఐటీసీ, సన్ఫార్మా, మారుతి షేర్లు నష్టాలబాట పట్టాయి.
అమెరికా స్టాక్ మార్కెట్లు గత సెషన్లో మిశ్రమ ధోరణితో ముగిశాయి. డోజోన్స్ 1.33 శాతం పడిపోయింది.
నాస్డాక్ 0.13 శాతం నష్టపోయింది. కానీ ఎస్అండ్పీ 500 సూచీ 0.13 శాతం లాభపడింది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
ఆస్ట్రేలియా ASX 0.78 శాతం, హాంకాంగ్ మార్కెట్ 1.61 శాతం, షాంఘై 0.33 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే జపాన్ నిక్కీ మాత్రం 1.24 శాతం నష్టాల్లో ఉంది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 66.88 డాలర్లు
ఇక, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 66.88 డాలర్ల వద్ద ఉంది.
బంగారం ధర ఔన్సుకు 3,392 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్లో విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) సుమారు రూ.4,668 కోట్ల విలువైన స్టాక్స్ను కొనుగోలు చేయగా, దేశీయ ఇన్వెస్టర్లు (DIIs) రూ.2,006 కోట్ల షేర్లను విక్రయించారు.