LOADING...
Indian Railways: కొత్త సాంకేతికతతో కుదుపుల్లేని రైలు ప్రయాణం
కొత్త సాంకేతికతతో కుదుపుల్లేని రైలు ప్రయాణం

Indian Railways: కొత్త సాంకేతికతతో కుదుపుల్లేని రైలు ప్రయాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2026
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేగంగా దూసుకెళ్తున్న రైలులో అకస్మాత్తుగా వచ్చే కుదుపులు,పట్టాల నుంచి వినిపించే గట్టిగా మోగే శబ్దాలు ప్రయాణికులకు సర్వసాధారణ అనుభవం. ముఖ్యంగా వంతెనలు, మార్గమధ్య మార్పిడి ప్రాంతాలు దాటేటప్పుడు ఈ అసౌకర్యం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, అన్నీ కుదిరితే త్వరలోనే ఆ చిక్కులన్నీ కనుమరుగు కానున్నాయి. రైల్వే ట్రాక్‌లలో ఇప్పటివరకు వాడుతున్న ఇనుము, కాంక్రీట్‌ స్లీపర్లకు బదులుగా 'కంపోజిట్‌ స్లీపర్లను' ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇవి తక్కువ బరువు కలిగి ఉన్నప్పటికీ, ఒక చదరపు సెం.మీ.పై సుమారు 700 కిలోల వరకు బరువును మోయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటిలో ఉన్న మెరుగైన కుదింపు శక్తి వల్ల రైలు ప్రయాణంలో కలిగే కుదుపులు గణనీయంగా తగ్గుతాయి.

వివరాలు 

పట్టాలలో ఏర్పడే అతి చిన్న చీలికలను గుర్తించడానికి ప్రత్యేక అయస్కాంత కణ పరీక్ష

అలాగే, వీటి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు మరమ్మతులు కూడా సులభంగా చేయవచ్చు. ముఖ్యంగా వంతెనలు, మార్గమధ్య మార్పిడి ప్రాంతాల్లో వీటి వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇకపోతే, పట్టాల భద్రతను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సును వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పట్టాలలో ఏర్పడే అతి చిన్న చీలికలను గుర్తించడానికి ప్రత్యేక అయస్కాంత కణ పరీక్ష విధానాన్ని అమలు చేయనున్నారు.

వివరాలు 

ముందుగానే హెచ్చరికలు

అదేవిధంగా, ప్రత్యేక పరిశీలనా వాహనాల్లో అమర్చిన పరికరాలు పట్టాల కింద ఉన్న నేల స్థితిని పరిశీలిస్తాయి. ఎక్కడైనా నేల బలహీనపడినా లేదా పట్టాలు దెబ్బతిన్నా ముందుగానే హెచ్చరికలు అందిస్తాయి. దీని ద్వారా ప్రమాదాలను ముందుగానే అరికట్టే అవకాశం ఉంటుంది. ఈ మార్పులు అమలులోకి వస్తే రైలు ప్రమాదాల అవకాశాలు తగ్గడమే కాకుండా, సాంకేతిక లోపాల వల్ల కలిగే ఆలస్యాలు కూడా తగ్గుతాయి. ఫలితంగా ప్రయాణం మరింత వేగంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా మారనుంది.

Advertisement