Stock market:నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,500 దిగువకు నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి మళ్లాయి.
అమెరికా ఫ్యూచర్స్ నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపర్లు చివరి దశలో అమ్మకాలకు మొగ్గుచూపారు.
దీని ప్రభావంతో, ఇంట్రాడే గరిష్ఠ స్థాయిల నుంచి సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోయి, నిఫ్టీ 22,500 దిగువకు చేరింది.
ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు సూచీలకు మద్దతునిచ్చినా, ఎల్అండ్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సూచీలను కిందకు లాగాయి. మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
సెన్సెక్స్ 74,474.98 పాయింట్ల వద్ద (గత ముగింపు 74,332.58) లాభాల్లో ప్రారంభమైంది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70.51 డాలర్లు
ఉదయం లాభాలతో కొనసాగిన సూచీ, ఇంట్రాడేలో 74,741.25 వద్ద గరిష్ఠాన్ని తాకింది.
అయితే, మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకుని, 74,022.24 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
చివరికి, 217.41 పాయింట్ల నష్టంతో 74,115.17 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 77.55 పాయింట్లు తగ్గి 22,474.95 వద్ద స్థిరపడింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 38 పాయింట్లు క్షీణించి 87.33గా నమోదైంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్,జొమాటో,ఎల్అండ్టీ,టైటాన్,మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగియగా, పవర్గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
అంతర్జాతీయంగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70.51 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 2,914 డాలర్ల వద్ద కొనసాగుతోంది.