Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో వరుసగా మూడో రోజూ మార్కెట్ లాభాల్లో ముగిసింది. కొన్ని కంపెనీలు అంచనాలకు మించిన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం కనిపించింది. దీంతో సెన్సెక్స్ సుమారు 200 పాయింట్లు పెరిగి ముగిసింది. నిఫ్టీ కూడా 25,900 మార్క్ పైన నిలకడగా కొనసాగింది.
వివరాలు
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.57గా నమోదు
సెన్సెక్స్ ఉదయం 84,210 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది (ముందరి ముగింపు 84,065.75). ట్రేడింగ్ మొత్తం కాలంలో సూచీ పాజిటివ్ జోన్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,482.95 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 208.17 పాయింట్లు పెరిగి 84,273.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 67.85 పాయింట్ల లాభంతో 25,935.15 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.57 వద్ద కొనసాగింది. సెన్సెక్స్ 30 షేర్లలో ఎటెర్నల్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.