LOADING...
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 26వేల ఎగువకు నిఫ్టీ
లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 26వేల ఎగువకు నిఫ్టీ

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 26వేల ఎగువకు నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల సంకేతాలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు త్వరలో తగ్గించొచ్చన్న అంచనాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచాయి. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరబోతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్‌లో పాజిటివ్‌ సెంటిమెంట్‌కు దోహదపడ్డాయి. ప్రధానంగా మెటల్‌, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌, ఎనర్జీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించగా, ఆటో రంగం షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్‌ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 85,000 మార్కును అధిగమించగా, నిఫ్టీ 26,000 స్థాయిని దాటింది.

వివరాలు 

 విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 88.21గా  నమోదు 

రోజు ఆరంభంలో సెన్సెక్స్‌ 84,663.68 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 84,628.16) స్వల్ప లాభాలతో మొదలై,రోజంతా లాభాల మోమెంటాన్ని కొనసాగించింది. ఇంట్రాడేలో 85,105.83 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత, చివరికి 368.97 పాయింట్లు పెరిగి 84,997.13 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 117.70 పాయింట్లు పెరిగి 26,053.90 వద్ద ముగిసింది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 88.21గా నమోదైంది. సెన్సెక్స్‌ 30 సూచీలలో అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా స్టీల్‌ వంటి షేర్లు గణనీయ లాభాలను సాధించగా, బీఈఎల్‌, ఎటెర్నల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

వివరాలు 

బంగారం ఔన్సు 4,027 డాలర్లు 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.48 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, బంగారం ధర మళ్లీ ఔన్సుకు 4,000 డాలర్ల మార్క్‌ దాటింది. ప్రస్తుతానికి బంగారం ఔన్సు 4,027 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.