Navi Mumbai airport: నవి ముంబై ఎయిర్పోర్టులో 'మార్కెట్ వైఫల్యం'.. ట్రాయ్ జోక్యం కోరిన టెల్కోలు
ఈ వార్తాకథనం ఏంటి
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) వద్ద టెలికాం సేవల విషయంలో మోనోపోలీ పరిస్థితి ఏర్పడిందని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)ని కోరాయి. అలాగే ఎయిర్పోర్టులు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఇన్బిల్డింగ్ మొబైల్ మౌలిక వసతుల ఛార్జీలకు పరిమితి విధించాలని డిమాండ్ చేశాయి. డిసెంబర్ 25 నుంచి నవి ముంబై ఎయిర్పోర్టులో కమర్షియల్ ఆపరేషన్లు ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు అక్కడ మొబైల్ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రాలేదు. టెలికాం కంపెనీలు, ఎయిర్పోర్టు నిర్వాహక సంస్థ మధ్య వాణిజ్య ఒప్పందాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు మొబైల్ సిగ్నల్ లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
వివరాలు
తప్పనిసరిగా ఇన్బిల్డింగ్ టెలికాం నెట్వర్క్
ఇలాంటి పరిస్థితి ముంబై మెట్రో ఆక్వా లైన్లోనూ కనిపిస్తోంది. అక్కడ కూడా వాణిజ్య షరతులపై ఒప్పందం కుదరకపోవడంతో, గత మూడు నెలలుగా ప్రయాణికులకు మొబైల్ కనెక్టివిటీ సరిగా అందడం లేదని టెల్కోలు చెబుతున్నాయి. తమ ప్రతినిధి సంస్థ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) ద్వారా టెలికాం కంపెనీలు ట్రాయ్కు ఫిర్యాదు చేశాయి. నవి ముంబై ఎయిర్పోర్టును అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (NMIAL) తమకు రైట్ ఆఫ్ వే (RoW) అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించాయి. అంతేకాకుండా ఎయిర్పోర్టులో ఒకే ఒక్క ఇన్బిల్డింగ్ టెలికాం నెట్వర్క్ను తప్పనిసరిగా ఉపయోగించాలనే నిబంధనను విధిస్తున్నట్లు తెలిపాయి.
వివరాలు
4G,5G సేవల కోసం తమ స్వంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు RoW అనుమతులు
జనవరి 13న ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటికు రాసిన లేఖలో, COAI డైరెక్టర్ జనరల్ ఎస్.పీ. కొచ్చర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భార్టీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు 4G, 5G సేవల కోసం తమ స్వంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు RoW అనుమతులు కోరినా,టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023, RoW నిబంధనలకు విరుద్ధంగా NMIAL వాటిని తిరస్కరించిందని ఆయన పేర్కొన్నారు. బదులుగా, NMIAL లేదా దాని అనుబంధ సంస్థ ఏర్పాటు చేసిన ఇన్బిల్డింగ్ సొల్యూషన్స్ (IBS) నెట్వర్క్ను తప్పనిసరిగా వాడాలని, తామే నిర్ణయించిన షరతులు, అధిక ఛార్జీలను టెల్కోలపై మోపుతున్నట్లు COAI ఆరోపించింది.
వివరాలు
ఒక్కో టెలికాం కంపెనీ నుంచి నెలకు సుమారు రూ.92 లక్షలు వసూలు
ఒక్కో టెలికాం కంపెనీ నుంచి నెలకు సుమారు రూ.92 లక్షలు వసూలు చేయాలని, ఏడాదికి నాలుగు కంపెనీలపై కలిపి దాదాపు రూ.44.16 కోట్లు వసూలు చేయాలనే ఉద్దేశం ఉందని తెలిపింది. ఈ ఛార్జీలు అసలు మౌలిక వసతుల ఖర్చులతో ఏమాత్రం సంబంధం లేకుండా అతిగా ఉన్నాయని COAI పేర్కొంది. సాధారణంగా ఒక స్వతంత్ర IBS నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి అయ్యే మూలధన, నిర్వహణ ఖర్చుల కంటే ఇవి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని, RoW నిబంధనల ప్రకారం అనుమతించే తగిన ఖర్చులకు ఇవి పూర్తిగా విరుద్ధమని తెలిపింది.
వివరాలు
NMIAL ఒక్కటే ఇన్బిల్డింగ్ టెలికాం మౌలిక వసతుల సరఫరాదారుగా మారింది
ఎయిర్పోర్టు ప్రాంగణంపై నియంత్రణను ఉపయోగించుకుని, NMIAL ఒక్కటే ఇన్బిల్డింగ్ టెలికాం మౌలిక వసతుల సరఫరాదారుగా మారిందని, మిగతా లైసెన్సు పొందిన టెలికాం కంపెనీలకు తమ నెట్వర్క్లు ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా చేస్తోందని COAI విమర్శించింది. దీంతో ఇది స్పష్టమైన 'మార్కెట్ వైఫల్యం'కి దారితీసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో NMIAL వ్యవహారాన్ని ట్రాయ్ పరిశీలించాలని, పబ్లిక్ ప్రదేశాల్లో ఇన్బిల్డింగ్ మౌలిక వసతుల కోసం ఖర్చు ఆధారిత ధరల విధానం తీసుకువచ్చి, గరిష్ఠ ఛార్జీలను నిర్ణయించాలని COAI కోరింది. అలాగే RoW అనుమతులు వివక్ష లేకుండా ఇవ్వాలని, లేదంటే నియంత్రిత, పారదర్శక షరతులతోనే షేర్డ్ మౌలిక వసతులను అమలు చేయాలని సూచించింది.
వివరాలు
ట్రాయ్ తక్షణమే జోక్యం చేసుకోవాలి
ఇలాంటి ప్రత్యేక IBS ఒప్పందాలు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు, మెట్రో ప్రాజెక్టులు తదితర పబ్లిక్ మౌలిక వసతుల్లో పెరుగుతున్నాయని, ఇది పోటీకి, వినియోగదారుల అనుభవానికి నష్టం కలిగిస్తుందని COAI హెచ్చరించింది. దీనిని అరికట్టాలంటే ట్రాయ్ తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.